ఏడుసార్లు వాయిదా... ఇప్పుడు మళ్లీనా?

‘మైదాన్‌’ వాయిదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఏడుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి అదే బాటలో వెళుతున్నట్లు సమాచారం.

Published : 06 Jun 2023 01:18 IST

‘మైదాన్‌’ వాయిదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఏడుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి అదే బాటలో వెళుతున్నట్లు సమాచారం. అజయ్‌ దేవ్‌గణ్‌ నటించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కావాలి. కానీ ఇప్పుడు ఆ తేదీన రావడం లేదు. మరో కొత్త డేట్‌ని చిత్రబృందం ప్రకటించనుందట. ఈ సినిమాలో భారతీయ ఫుట్‌బాల్‌ కోచ్‌  సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌గా అజయ్‌ కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ పదేపదే మారుతుండటంతో థియేటర్‌ల్లోనే వస్తుందా? చివరికి ఓటీటీ బాట పడుతుందా? అనే మాటలు కూడా బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఈ సినిమా వాయిదాతో విక్రమ్‌ భట్‌ నిర్మిస్తోన్న ‘1920: హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’ ఆ రోజున విడుదలయ్యే అవకాశం ఉంది.


శత్రువెవరో.. మిత్రుడెవరో?

‘షో’, ‘మిస్సమ్మ’ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు దర్శకుడు నీలకంఠ. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘సర్కిల్‌’. ఎవరు, ఎప్పుడు, ఎందుకు శత్రువులవుతారో.. అన్నది ఉపశీర్షిక. సాయి రోనక్‌, బాబా భాస్కర్‌, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ.. ‘‘జీవితం, మరణం, విధి.. ఈ మూడింటి కలయిక గురించి చెప్పే చిత్రమిది. ఇందులో హీరో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఓ సర్కిల్లో చిక్కుకుంటాడు. ఎవరు శత్రువు.. ఎవరు మిత్రుడు అని తెలుసుకోలేని సందిగ్ధంలో పడతాడు. మరి ఆ సమస్యల నుంచి హీరో బయటకు రాగలిగాడా? లేదా? అన్నది చిత్ర కథ. సినిమాలో భావోద్వేగాల్ని చాలా సరికొత్తగా చూపించాం. తన పాత్రలోని ఎమోషన్స్‌ను సాయి రోనక్‌ చాలా బాగా చూపించాడు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నాది ఒక ఫొటోగ్రాఫర్‌ పాత్ర. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు హీరో సాయిరోనక్‌. ఈ కార్యక్రమంలో బాబా భాస్కర్‌, శరత్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకి సంగీతం: ఎస్‌.ఎస్‌ ప్రశు, ఛాయాగ్రహణం: రంగనాథ్‌ గోగినేని.


శకుని మామ ఇక లేరు

‘మహాభారతం’ ధారావాహికలో శకుని పాత్రధారి, ప్రముఖ నటుడు గూఫీ పెయింటాల్‌ (79).. వృద్ధాప్య, హృద్రోగ సంబంధ సమస్యలతో ముంబయిలోని ఓ ఆసుపత్రిలో సోమవారం కన్నుమూశారు. 1970లో తెరగేట్రం చేసిన గూఫీ.. 1988లో బీఆర్‌ చోప్రా తెరకెక్కించిన ప్రఖ్యాత టెలివిజన్‌ సిరీస్‌ ‘మహాభారత్‌’తో శకుని పాత్రతో వెలుగులోకి వచ్చారు. కళ్లతోనే.. వంచన, క్రూరత్వంలాంటి భావోద్వేగాలను పండించి ఆకట్టుకున్నారు. ‘పరమ్‌వీర్‌ చక్ర’, ‘శ్రీకృష్ణ్‌’, ‘రాధాకృష్ణ్‌’ ‘సీఐడీ’లు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. గూఫీ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని