Paiyaa: 13 ఏళ్ల తర్వాత హిట్‌ కాంబో రిపీట్‌.. దానికి సీక్వెల్‌ కాదట!

కార్తి హీరోగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌.. ‘ఆవారా’. ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా రానుంది.

Published : 07 Jun 2023 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆవారా’ (Awaara) సినిమాతో హిట్‌ కాంబినేషన్‌గా నిలిచారు హీరో కార్తి (Karthi), దర్శకుడు లింగుస్వామి (Lingusamy). ఈ చిత్రంతో కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ ఈ కాంబోకి మంచి క్రేజ్‌ ఏర్పడింది. వీరిద్దరు మళ్లీ కలిసి పనిచేయబోతున్నారని కోలీవుడ్‌లో ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 13 ఏళ్ల తర్వాత ‘ఆవారా’కు సీక్వెల్‌ స్టోరీ సెట్‌ చేశారని, త్వరలోనే ఆ పార్ట్‌ 2 మొదలవుతుందనేది వాటిల్లోని సారాంశం. అయితే, వారు ‘ఆవారా 2’ తీయట్లేదనేది సమాచారం. కార్తి- లింగుస్వామి కలిసి ఆవారా సీక్వెల్‌ కోసం వర్క్‌ చేయట్లేదని, వారి కాంబినేషన్‌లో మరో సినిమా తప్పక వస్తుందని కోలీవుడ్‌ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్టు నచ్చడంతో నటించేందుకు కార్తి.. లింగుస్వామికి ఓకే చెప్పారట. మరి, లింగుస్వామి, కార్తి తమ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ చేస్తారా? కొత్త చిత్రమా? అంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.

యాక్షన్‌ అడ్వెంచర్‌ కథతో రూపొందిన ‘ఆవారా’ (తమిళ్‌లో Paiyaa) 2010లో విడుదలైంది. తమన్నా కథానాయిక. ప్రధాన పాత్రలు బెంగళూరు నుంచి ముంబయి వరకు చేసే కారు ప్రయాణం ప్రధానాంశంగా సినిమా తెరకెక్కింది. ఇందులోని ‘నీ ఎదలో నాకు చోటు వద్దు’, ‘అరెరే వానా’, ‘చిరు చిరు చినుకై కురిశావె’ పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అంతగా తన బాణీలతో మాయచేసిన యువన్‌ శంకర్‌ రాజానే ‘ఆవారా’ కాంబోలో రూపొందనున్న కొత్త సినిమాకీ సంగీతం అందించనున్నారని సమాచారం. ‘ఆవారా’ కంటే ముందు ‘రన్‌’, ‘పందెంకోడి’ తదితర డబ్బింగ్‌ చిత్రాలతో అలరించిన లింగుస్వామి నేరుగా తెలుగులో తీసిన తొలి సినిమా.. ‘ది వారియర్‌’. రామ్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం గతేడాది విడుదలైన, ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.

‘సర్దార్‌’ (sardar), ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (ponniyin selvan) సిరీస్‌ సినిమాల విజయోత్సాహంలో ఉన్న కార్తి.. ‘జపాన్‌’ (japan)లో నటిస్తున్నారు. దర్శకుడు రాజు మురుగన్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో.. దొంగగా కనిపించనున్నారని తెలుస్తోంది. తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, ‘96’ సినిమా ఫేమ్‌ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో కార్తి ఓ చిత్రం చేయనున్నారని సమాచారం. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే ఆ కథలో ప్రతినాయకుడిగా ప్రముఖ నటుడు అరవింద స్వామి నటించనున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు