NTR: ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్‌

ఎన్టీఆర్‌ను బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

Published : 01 May 2024 13:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వార్‌2’ షూటింగ్‌తో ఎన్టీఆర్‌ బిజీగా ఉన్నారు. దీని చిత్రీకరణ కోసం ఆయన ముంబయిలో బస చేసిన విషయం తెలిసిందే. ఇటీవల అక్కడి స్టార్స్‌ పార్టీలోనూ ఈ హీరో సందడి చేశారు. తాజాగా సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఆయనను కలిశారు. తారక్‌తో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. తన అభిమాన నటుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన పనిచేసే విధానం తనకెంతో ఇష్టమని ప్రశంసించారు. ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ పోస్ట్‌పై తారక్‌ స్పందించారు. ‘నన్నెప్పడూ మెచ్చుకునే మీ పనితీరు కూడా మాటలకందనిది. భవిష్యత్తు తరాలకు మీరు స్ఫూర్తినిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చారు.

ఈ ఫొటోను షేర్‌ చేస్తోన్న అభిమానులు.. ‘ప్రశాంత్ నీల్‌-ఎన్టీఆర్‌ కాంబోలో రానున్న చిత్రంలో అనుపమ్‌ఖేర్ నటిస్తున్నారా?’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరేమో ‘వార్‌2’లో ఆయన ఉన్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం తారక్‌ ‘దేవర’లో నటిస్తున్నారు. దీని షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం పాటలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇది. ఈ చిత్రంతో జాన్వీ తెలుగు తెరకు పరిచయమవుతుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌ను అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌ హీరోగా రూపొందుతోన్న ‘వార్‌2’లోనూ ఎన్టీఆర్‌ నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని