Raghavendra rao: టికెట్‌ ధరల తగ్గింపుతో అందరూ నష్టపోతారు

టికెట్‌ రేట్లు - షోల తగ్గింపు నిర్ణయం వల్ల చాలా మంది తీవ్ర నష్టాలకు గురవుతారన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. అదే రేట్లు పెంచి ఆన్‌లైన్‌లో అమ్మితే థియేటర్ల వల్ల ప్రభుత్వానికి ఎక్కువ టాక్స్‌ వస్తుందని సలహా ఇచ్చారు.

Updated : 02 Dec 2021 09:25 IST

టికెట్‌ రేట్లు - షోల తగ్గింపు నిర్ణయం వల్ల చాలా మంది తీవ్ర నష్టాలకు గురవుతారన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. అదే రేట్లు పెంచి ఆన్‌లైన్‌లో అమ్మితే థియేటర్ల వల్ల ప్రభుత్వానికి ఎక్కువ టాక్స్‌ వస్తుందని సలహా ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు రాఘవేంద్రరావు. ‘‘45ఏళ్లుగా పరిశ్రమలో దర్శకుడిగా - నిర్మాతగా కొనసాగుతున్నా. నా అభిప్రాయాలు అర్థం చేసుకోండి. మనమెప్పుడూ మూలాల్ని మర్చిపోకూడదు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి కారణం ముందుగా ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యం, పంపిణీదారులు, నా నిర్మాతలే. వీళ్లందరూ బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది. ప్రస్తుతం టికెట్‌ ధరలు, షోలు తగ్గించడం వల్ల పైన చెప్పిన అందరూ తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే 100 సినిమాల్లో 10శాతం విజయాలూ ఉండవు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం వల్ల దోపిడి ఆగిపోతుందనడం సరికాదు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలనుకుంటే టికెట్‌ ధర రూ.300 అయినా.. రూ.500 అయినా చూస్తాడు. ఒక రూపాయికే సినిమా చూపిస్తామన్నా అతనికి నచ్చని సినిమా చూడడు. పైగా ఈ ఆన్‌లైన్‌ విధానం వల్ల పలుకుబడి ఉన్న వాళ్లు బ్లాక్‌ చేసుకొని, వాళ్ల శిష్యుల ద్వారా బ్లాక్‌లో అమ్మవచ్చు. అదే రేట్లు పెంచి ఆన్‌లైన్‌లో అమ్మితే థియేటర్ల వల్ల ప్రభుత్వానికి ఎక్కువ టాక్స్‌ వస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేకూర్చాలని ఆశిస్తున్నా’’ అని రాఘవేంద్రరావు తన ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని