కాంగ్రెస్‌ ఇక ప్రత్యామ్నాయం కాదు: సిబల్‌

బిహార్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఘోరపరాభవం చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీని దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదని పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ అభిప్రాయపడ్డారు. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన సొంతపార్టీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు......

Updated : 16 Nov 2020 12:34 IST

సొంత పార్టీపై కపిల్‌ సిబల్‌ సంచలన వ్యాఖ్యలు

పట్నా: బిహార్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఘోరపరాభవం చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీని దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదని పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ అభిప్రాయపడ్డారు. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన సొంతపార్టీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ప్రస్తావించారు. వెంటనే పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు.

బిహార్‌లో ప్రజలు ఆర్జేడీని ప్రత్యామ్నాయంగా భావించారని సిబల్‌ తెలిపారు. అలాగే గుజరాత్‌లో జరిగిన ఉపఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలవలేకపోయామన్నారు. ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తిందన్నారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి రెండు శాతం కంటే తక్కువ ఓట్లు పడ్డాయన్నారు. ఆరేళ్లుగా ఆత్మపరిశీలన చేసుకోలేని కాంగ్రెస్‌.. ఇకపై చేసుకుంటుందని ఎలా ఆశించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమస్యలేంటో అందరికీ తెలుసని.. అయినా, వాటి పరిష్కారాలను గుర్తించడానికి ఎవరూ ఇష్టపడడం లేదని సిబల్ తెలిపారు. ‘‘పార్టీలో ఏం సమస్య ఉందో మాకు తెలుసు. వ్యవస్థాపకంగా ఎలాంటి లోపాలున్నాయో తెలుసు. వాటి పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలకు సమాధానాలేంటో పార్టీకి తెలుసు. కానీ, వాటిని అధికారికంగా గుర్తించడానికి మాత్రం వారు ఇష్టపడడం లేదు. ఇలాగే కొనసాగితే.. పార్టీ గ్రాఫ్‌ పడిపోతూనే ఉంటుంది. అలాంటి దుస్థితిలో పార్టీ ఉందన్నదే మా ఆవేదన’’ అని సిబల్‌ అన్నారు. 

పార్టీలో కీలక పాత్ర పోషించే ‘కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ’(సీడబ్ల్యూసీ) నామినేటెడ్‌ బాడీ కావడమే పార్టీ దుస్థితికి కారణమని సిబల్‌ విశ్లేషించారు. సీడబ్ల్యూసీ ఏర్పాటు ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఎన్నికలో పరాభవం ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ దుస్థితిని మార్చే పరిష్కారం నామినేటెడ్‌ సభ్యుల నుంచి వస్తుందని భావించలేమన్నారు. పార్టీలో ఉన్న ‘నామినేటెడ్‌’ సంస్కృతి పోవాలన్నారు. ఇలాంటివి సంప్రదాయం ఎన్నికల్లో సత్ఫలితాలివ్వలేదన్నారు. ఇదే విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు, దాని పర్యవసనాల్ని చూడాల్సి వచ్చిందన్నారు. పరోక్షంగా గతంలో సిబల్‌ సహా మరో 22 మంది కాంగ్రెస్‌ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాసిన లేఖను ప్రస్తావించారు.

ఇప్పటి వరకు పార్టీలో ఎవరూ లేఖపై వివరణ కోరలేదన్నారు. అది రాసిన సభ్యులతో కనీసం మాట్లాడే ప్రయత్నమూ చేయలేదని వివరించారు. దీంతో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే వేదికే లేకుండా పోయిందన్నారు. అందుకే ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయాల్సి వస్తోందన్నారు. తాను కాంగ్రెస్‌ వ్యక్తినని.. భవిష్యత్తులోనూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం దేశాన్ని పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం చూపిస్తుందని.. చూపాలని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. బిహార్‌లో పార్టీ ఫలితాలపై ఇప్పటి వరకు అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని సిబల్‌ పేర్కొన్నారు. బహుశా దీన్ని వారు సర్వసాధారణ విషయంగా భావించి ఉంటారన్నారు. 

పార్టీ ప్రక్షాళన ఎలా చేపట్టాలో సిబల్‌ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన నేతలు, దేశ సమకాలీన రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకునే వ్యక్తులు, మీడియాలో పార్టీని చూపించాల్సిన విధానం గురించి అవగాహన ఉన్న నాయకులతో చర్చించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను చేరుకోవాలంటే కూటములు తప్పవన్నారు. ప్రజలు ఇక ఏమాత్రం పార్టీ దగ్గరకు వచ్చే పరిస్థితి లేదన్నారు. పార్టీయే ప్రజల వద్దకు వెళ్లాలని హితవు పలికారు. దీనికి అనుభవజ్ఞులైన నాయకుల సూచనలు అవసరమన్నారు. ఇవన్నీ జరగాలంటే ముందు పార్టీలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని