ప్రధాని మోదీ స్వప్నం అదే: యోగి

యూపీలోని రామజన్మభూమి అయోధ్యను వేద రామయణ నగరంగా అభివృద్ధి చేయడమే ప్రధాని మోదీ స్వప్నమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. దీన్ని సుందర నగరంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్‌ కార్యక్రమంలో...........

Published : 14 Nov 2020 01:27 IST

అయోధ్య: యూపీలోని రామజన్మభూమి అయోధ్యను వేద రామయణ నగరంగా అభివృద్ధి చేయడమే ప్రధాని మోదీ స్వప్నమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. దీన్ని సుందర నగరంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్‌ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం ప్రారంభ ఘట్టం చూడటం ఈ తరం అదృష్టమేనన్నారు. గత 500 ఏళ్లుగా సాగిన పోరాటంలో ఎంతోమంది సాధువులు ఈ నిర్మాణం ప్రారంభం కావాలని కలలు కన్నప్పటికీ చివరకు మరణించారని తెలిపారు. రామ రాజ్యం అనే భావజాలాన్ని అమలుపరుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

సుందరమైన ఆధ్యాత్మిక నగరంగా దీన్ని తీర్చిదిద్దడంలో అందరి మద్దతు తీసుకుంటున్నామన్నారు. దేశంలో కేంద్రం చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, విద్యుత్‌ కనెక్షన్లు, పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం వంటివి కార్యక్రమాలు అభివృద్ధికి సూచికలుగా నిలుస్తున్నాయని యోగి చెప్పారు. కరోనా లేకపోయినట్టయితే ఈ దీపోత్సవం మరింత ఘనంగా జరుపుకొనేవాళ్లమని తెలిపారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కరోనా వైరస్‌పై గట్టిగా పోరాటం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

రామ్‌, రామరాజ్య అనే పదాలు భారతీయ సంస్కృతి నుంచి విడదీయరాని భాగాలని యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ అన్నారు. కరోనా అంతమయ్యేంత వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ దీపోత్సవ్‌ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌, పలువురు సాధువులు, మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని