ఆ చట్టాల్ని తిప్పికొట్టేలా చట్టాలు చేయండి : సోనియా 

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాల అమలును అడ్డుకొనే చట్టాల్ని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో తీసుకురావాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి

Published : 29 Sep 2020 01:24 IST

దిల్లీ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాల అమలును అడ్డుకొనే చట్టాల్ని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో తీసుకురావాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు సూచించారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254(2) ప్రకారం కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కొత్త చట్టాల్ని తీసుకొచ్చే మార్గాలను అన్వేషించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు. ఈ విధానం ప్రకారం కేంద్ర చట్టానికి సమ్మతి తెలపకుండా చట్టం చేసుకొనే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది. అనంతరం ఆ చట్టం రాష్ట్రపతి ఆమోదం కోసం వెళుతుందని’ కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు. 
సోనియా గాంధీ సూచించిన ఈ చట్టం ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్రాల్లో అమలు కాకుండా చేసే వీలుంది. అయితే దీనికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరిగా ఉండి తీరాలి. అప్పుడే అది రాష్ట్రంలో పక్కాగా అమలు చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారమే ఆమోదం తెలిపారు. ఈ చట్టం ద్వారా రైతులు సులభంగా తమ పంటను పెద్ద వ్యాపారులకు అమ్ముకునే సౌలభ్యం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కాలం చెల్లిన విధానానికి స్వస్తి పలికి, దళారుల బెడద లేకుండా వ్యవస్థాగత కొనుగోలుదార్లకు, పెద్ద రీటైలర్లకు అమ్మకాలు చేసే సదుపాయం రైతులకు దొరుకుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఈ విధానంతో రైతులు బేరమాడి మంచి ధర పొందలేరని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో హోల్‌సేల్‌ మార్కెట్‌ వ్యవస్థ, సకాలంలో చెల్లింపులు ఉండవని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం తెలుపుతున్నాయి. ఈ చట్టాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తాయని ఆక్షేపిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని