Revanth Reddy: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో భేషజాలకు వెళ్లం: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సేనని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.

Updated : 07 Mar 2024 19:48 IST

అల్వాల్‌: హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సేనని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం వల్లే నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌ రహదారిలో పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అల్వాల్‌ సమీపంలో సీఎం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. భారాస హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. నగరంలో గంజాయి, పబ్బులు, డ్రగ్స్‌ వచ్చాయని విమర్శించారు. గత భారాస ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రజల సమస్యలను పక్కన పెట్టిందని ఆరోపించారు.  కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్టు చెప్పారు.  ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడిన తర్వాత గత ప్రభుత్వ వైఫల్యం తన దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేటీఆర్‌ ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు ప్రస్తుతం మోక్షం లభించిందదని, ఈ కారిడార్‌తో ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. 

‘‘ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో భేషజాలకు వెళ్లం. రెండో దశలో 75కి.మీ మెట్రో విస్తరణ చేపట్టబోతున్నాం. నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్‌లో భారాస ధర్నా చేపట్టాలి. దానికి కాంగ్రెస్‌ పూర్తిగా సహకరిస్తుంది. ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లా. గత ప్రభుత్వానికి కేంద్రంతో వివాదం వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని