Revanth reddy: సోమేష్‌కుమార్‌ నియామకంపై కోర్టును ఆశ్రయిస్తాం: రేవంత్‌ రెడ్డి

సీఎం ప్రధాన సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్‌ సోమేష్‌కుమార్‌ నియామకంపై కోర్టును ఆశ్రయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు.  ప్రభుత్వ కాలం మరో ఆరు నెలలే ఉండగా.. సోమేష్‌కుమార్‌ను మూడేళ్ల కాలానికి ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.

Published : 10 May 2023 22:07 IST

హైదరాబాద్: కాంగ్రెస్ యూత్ డిక్లరేషనన్ సభ విజయవంతమైందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో అయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. రెండు రోజుల్లో యూత్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అవినీతిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. సీఎం ప్రధాన సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్‌ సోమేష్‌కుమార్‌ నియామకంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. గతంలో రాష్ట్రంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన అధికారులు కేసీఆర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని.. అందుకే వారిని తన పక్కన పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కాలం మరో ఆరు నెలలే ఉండగా.. సోమేష్‌కుమార్‌ను మూడేళ్ల కాలానికి ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సలహాదారులకు కేబినెట్‌ హోదా ఇవ్వడానికి అవకాశం లేదని రేవంత్‌ అన్నారు.

ఎంత చేసినా కర్ణాటక ప్రజలు కేసీఆర్‌ను నమ్మరు..

‘‘సీఎం కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసమే సమగ్ర సర్వే వివరాలను బయటపెట్టలేదు. ఆ సర్వేను ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారు. కర్ణాటకలో భాజపా కోసం కేసీఆర్‌ పనిచేశారు. అక్కడ హంగ్ వస్తే భాజపాకు జేడీఎస్‌ మద్దతు తెలిపే విధంగా కేసీఆర్ వ్యుహరచన చేశారు. ఎంఐఎం ఓట్లు చీలిస్తే జేడీఎస్‌కు నష్టం జరుగుతుందని కేసీఆర్ భావించారు. కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం పాటించారు. ఎంత చేసినా కర్ణాటక ప్రజలు కేసీఆర్‌ను నమ్మరు’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని