Karnataka: 34 మందితో సిద్ధరామయ్య కేబినెట్‌.. డీకేకు 2 శాఖలు..!

కర్ణాటక (Karnataka)లో పూర్తిస్థాయి కేబినెట్‌ (Cabinet Expansion) కొలువుదీరింది. సీఎం సిద్ధూ టీమ్‌లో మొత్తం 34 మంది మంత్రులకు చోటుదక్కింది. అయితే శాఖల కేటాయింపులపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Updated : 27 May 2023 17:33 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)లో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) ప్రక్రియ పూర్తయ్యింది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది ఇప్పటికే ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో 34 మందితో సీఎం సిద్ధరామయ్య కేబినెట్ పూర్తిగా సిద్ధమైంది.

ఒకే ఒక్క మహిళ..

శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ నూతన మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇందులో 23 మంది నూతన ఎమ్మెల్యేలుగా కాగా.. చట్టసభలకు ప్రాతినిధ్యం వహించని ఎన్‌.ఎస్‌ బోస్‌రాజును కేబినెట్‌లోకి తీసుకోవడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే అయిన జోస్‌రాజ్‌కు కాంగ్రెస్‌ (Congress) అధిష్ఠానం సూచన మేరకు మంత్రి పదవి ఇచ్చినట్లు పార్టీ నేత ఒకరు వెల్లడించారు. మొత్తం మంత్రి వర్గంలో ఒకే ఒక్క మహిళ చోటు దక్కింది. బెళగావి రూరల్‌ నుంచి రెండోసారి ఎన్నికైన లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఈమె పేరును ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ప్రతిపాదించారు.

మాజీ సీఎం ఆర్‌. గుండురావు తనయుడు దినేశ్‌ గుండు రావు, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వర ఖండ్రేతో పాటు కృష్ణభైరేగౌడ, రహీంఖాన్‌, సంతోశ్‌లాడ్‌, కె.ఎన్‌.రాజణ్ణ, పిరియాపట్టణ వెంకటేశ్‌, హెచ్‌.సి.మహదేవప్ప, భైరతి సురేశ్‌, శివరాజ్‌ తంగడిగి, ఆర్‌.బి.తిమ్మాపుర్‌, బి.నాగేంద్ర, డి.సుధాకర్‌, చలువరాయస్వామి, మంకుళ్‌ వైద్య, ఎం.సి.సుధాకర్‌, హెచ్‌.కె.పాటిల్‌, శరణ్‌ప్రకాశ్‌ పాటిల్‌, శివానందపాటిల్‌, ఎస్‌.ఎస్‌.మల్లికార్జున, శరణబసప్ప దర్శనాపూర్‌ కూడా మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు.

కీలక శాఖలు సిద్ధూ వద్దే..

మంత్రివర్గం ఏర్పాటైనప్పటికీ మంత్రిత్వ శాఖల కేటాయింపులపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అయితే ఆర్థికశాఖ, కేబినెట్‌ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్‌ వంటి కీలక శాఖలు సీఎం సిద్ధూ (Siddaramaiah) తన వద్దే ఉంచుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పార్టీ ప్రయోజనాల కోసం సీఎం పదవిని త్యాగం చేసి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్‌ (DK Shivakumar)కు బెంగళూరు నగర అభివృద్ధితో పాటు, నీటిపారుదల శాఖలను కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సిద్ధూ సర్కారు నుంచి ఇంకా స్పష్టత రాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని