Karnataka Elections: ఎస్సీ, ఎస్టీ రిజర్వు స్థానాలు.. మెజార్టీ సీట్లు కాంగ్రెస్‌ కైవసం..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వివిధ వర్గాల మద్దతు లభించినప్పటికీ.. భాజపాకు మాత్రం ఎస్సీ, ఎస్టీ ఆదరణ దక్కనట్లే కనిపిస్తోంది.

Updated : 14 May 2023 23:51 IST

దిల్లీ: కర్ణాటకలో తాజా ఎన్నికల్లో అధికార భాజపాకు ఘోర పరాజయం ఎదురైంది. కాంగ్రెస్‌ 135 చోట్ల విజయం సాధించగా భాజపా మాత్రం 66 స్థానాలకే పరిమితమైంది. అయితే, రాష్ట్రంలో ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే.. ఎస్సీ, ఎస్టీ రిజర్వు స్థానాల్లో మెజారిటీ నియోజకవర్గాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన భాజపాకు మాత్రం ఆశించిన మేరకు సీట్లను సాధించలేకపోయింది. ఎస్టీ రిజర్వు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

రిజర్వేషన్ల పెంపు హామీ ఇచ్చినా..

కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ రిజర్వు స్థానాలు మొత్తం 51 ఉన్నాయి. అందులో 36 ఎస్సీలకు రిజర్వు కాగా.. 15 మాత్రం ఎస్టీలకు కేటాయించారు. ఈ 36 ఎస్సీ స్థానాల్లో భాజపా అభ్యర్థులను రంగంలోకి దించగా.. అందులో 24 చోట్ల ఓటమి చవిచూసింది. మరోవైపు ఎస్టీ రిజర్వు సీట్లలో ఏ ఒక్క స్థానాల్లోనూ గెలవలేదు. అయితే, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని బొమ్మై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ వర్గాన్ని ఆకర్షించడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వు సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగరవేసింది. 36 సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు 21 చోట్ల విజయం సాధించగా భాజపా కేవలం 12 స్థానాల్లో గెలుపొందింది. జేడీఎస్‌ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. ఇక ఎస్టీ రిజర్వు స్థానాలు 15 ఉండగా.. అందులో 14 స్థానాలను కాంగ్రెస్‌ సత్తా చాటింది. ఒక సీటు మాత్రం జేడీఎస్‌కు దక్కింది. అదే 2018 ఎన్నికల్లో 51 రిజర్వు స్థానాల్లో 22 చోట్ల విజయం సాధించిన భాజపా.. ఈసారి చతికిలపడింది.

9 సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులే

రాష్ట్రంలో సుమారు 13 శాతం ఓట్లు ముస్లిం వర్గానికి చెందినవే. అయితే, కాంగ్రెస్‌ పార్టీ 15 మంది ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దించగా.. అందులో 9 మంది విజయం సాధించారు. జేడీఎస్‌ 23 మందికి టికెట్‌ ఇచ్చినప్పటికీ ఏ ఒక్కరినీ గెలిపించుకోలేకపోయింది. ఇక మజ్లిస్‌ (AIMIM) పార్టీ ఇద్దర్నీ బరిలో దింపినప్పటికీ కేవలం 0.02శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన తొమ్మిది మందిలో ఇద్దరు మాత్రమే రెండోసారి విజయం సాధించగా.. మిగతా ఏడుగురు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని