Kishan reddy: తెలంగాణలో బుల్డోజర్‌ ప్రభుత్వం రావాలి: కిషన్‌రెడ్డి

కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 21 Jul 2023 16:36 IST

హైదరాబాద్‌: తెలంగాణలో బుల్డోజర్‌ ప్రభుత్వం రావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌.. రోజులు లెక్కపెట్టుకోండి. మీ కుటుంబాన్ని ఫామ్‌ హౌస్‌కే పరిమితం చేస్తాం. మీ కుటుంబానికి బానిసలం కాదు. నిజాం భవనాన్ని తలపించేలా ప్రగతి భవన్‌ కట్టుకున్నారు. పేద ప్రజల ఇళ్ల కోసం మాత్రం స్థలం, నిధులు ఉండవు. భారాస, భాజపా ఒక్కటేనని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 10 ఎకరాలు పార్టీ కార్యాలయం కోసం ఇచ్చిందెవరు? తీసుకున్నది ఎవరు?కాంగ్రెస్‌ పార్టీని తలదన్నేలా భారాస అవినీతి చేసింది. మేము ఏ పార్టీతో కలవం.. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజలు భాజపా నేతృత్వంలో యుద్ధం చేస్తారు. తెలంగాణలో ఒక అడుగు వెనక్కి వేశామంటే పది అడుగులు ముందుకేస్తాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఆ కూటమి అధికారంలోకి వస్తే 3 నెలలకో ప్రధాని..

వెయ్యి మంది కేసీఆర్‌లు, లక్షమంది ఒవైసీలు, రాహుల్ గాంధీలు వచ్చినా 2024లో నరేంద్రమోదీని అడ్డుకోలేరు. ప్రతిపక్షాల కూటమిలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో తెలియదు. ఆ కూటమి అధికారంలోకి వస్తే 3నెలలకో ప్రధానమంత్రి మారుతారు. ఎవరినీ ఆ కుర్చీలో కూర్చోనివ్వరు. ఒకరు కాలు పట్టి గుంజితే.. మరొకరు చేయిపట్టి లాగుతారు. దేశ ప్రజలు సమర్థవంతమైన నాయకత్వం కోరుకుంటున్నారు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని