KTR: ‘న్యాయ్‌’ పేరిట నయా నాటకానికి తెర తీశారా?: కేటీఆర్‌

కాంగ్రెస్‌ శనివారం చేపట్టింది జనజాతర సభ కాదు.. హామీల పాతర, అబద్ధాల జాతర సభ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు.

Published : 07 Apr 2024 10:15 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శనివారం చేపట్టింది జనజాతర సభ కాదు.. హామీల పాతర, అబద్ధాల జాతర సభ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరిట గారడీ చేశారని చెప్పారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ముందు న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..? అని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరని అన్నారు.

‘‘నమ్మి ఓటేసిన 4 కోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలుగా కాంగ్రెస్‌ నయవంచన చేస్తోంది. అసత్యాలతో అధికారంలోకి వచ్చి అన్నదాతల ఆత్మహత్యలకు కారణమైంది. గ్యారంటీలకు పాతరేసి అసత్యాలతో జాతర చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారు. రుణమాఫీ లేక అప్పుల పాలవుతున్నారు. తాగునీటికి ప్రజలు తండ్లాడుతున్నారు. మీ మోసాలపై మహిళలు మండిపడుతున్నారు.

రాహుల్ గాంధీ.. మీకు మా అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడం లేదా? లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా? 200 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా? చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా? డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీయరా? 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఇంకా వెనుకబడి ఉన్నారంటే కారణం కాంగ్రెస్. కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. సకల రంగాలను సంక్షోభంలోకి నెట్టిన భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే నిండా మునగడం ఖాయమని తేలిపోయింది. వంద రోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం ఖాయం’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని