icon icon icon
icon icon icon

జనసేన పోటీలో లేనిచోట స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తు

జనసేన పోటీలో లేని పలు శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది.

Updated : 30 Apr 2024 11:33 IST

ఫ్రీ సింబల్స్‌ జాబితాలో పెట్టి కేటాయించిన ఎన్నికల సంఘం
ఓట్లు చీల్చేందుకు వైకాపాయే ఈ కుట్రకు తెర లేపిందంటున్న ప్రతిపక్షాలు
కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నచోటే కేటాయింపు

ఈనాడు-అమరావతి, యంత్రాంగం: జనసేన పోటీలో లేని పలు శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. తెదేపా, భాజపాతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తోంది. ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌ జాబితాలో పెట్టి, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఎన్డీయే కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి, ఓట్లు చీల్చేందుకు వైకాపాయే ఈ కుట్రకు తెరలేపిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రధానంగా ఎన్డీయే అభ్యర్థులు బలంగా, వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నచోట్ల.. స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్‌ అభ్యర్థులకు, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 50కు పైగా శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రులకు, చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

చంద్రబాబు, లోకేశ్‌, అచ్చెన్న బరిలో ఉన్నచోట..

  • తెదేపా అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఈమె మొరసన్నపల్లి వైకాపా సర్పంచ్‌ జగదీష్‌ భార్య. జగదీష్‌ వైకాపా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
  • తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.
  • తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలి నియోజకవర్గంలో, గంటా శ్రీనివాసరావు పోటీచేస్తున్న భీమిలిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు.
  •  తెదేపాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్న ఆమదాలవలస, విశాఖపట్నం తూర్పు, విజయవాడ సెంట్రల్‌, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం, మచిలీపట్నం, పాలకొల్లు, తణుకు, మండపేట, రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించారు.
  • అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో ప్రస్తుత తెదేపా ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఆయా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించారు. 2019లో చీరాలలోనూ తెదేపాయే గెలిచింది. ఇప్పుడు అక్కడా స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

కూటమి రెబల్‌ అభ్యర్థులకు సైతం

  • విజయనగరం శాసనసభ స్థానం నుంచి తెదేపా రెబల్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు, జగ్గంపేట నుంచి జనసేన రెబల్‌ అభ్యర్థిగా ఉన్న పి.సూర్యచంద్రకు ఈ గుర్తు కేటాయించారు. ఈ రెండుచోట్ల తెదేపా అభ్యర్థులు బలంగా ఉన్నారు.

వైకాపా ఎమ్మెల్యే కుమారుడికి కూడా

  •  పెదకూరపాడులో వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి నంబూరు శంకరరావు తనయుడు కల్యాణచక్రవర్తి స్వతంత్రునిగా నామినేషన్‌ వేయగా.. ఆయనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

వైకాపా వ్యూహంలో భాగమేనా?

  • వైకాపా పాలనలో అరాచక రాజ్యంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మద్దతుదారుకు, చంద్రగిరి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తులు ఇచ్చారు. తెదేపా బలంగా ఉన్న రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ కొందరికి ఈ గుర్తు కేటాయించారు.
  • కర్నూలు జిల్లా ఆదోనిలో స్వతంత్ర అభ్యర్థి యువరాజ్‌కు, పత్తికొండ నుంచి బరిలో ఉన్న నేషనల్‌ నవక్రాంతి పార్టీ అభ్యర్థి వాల్మీకి పెద్దయ్యకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.
  • శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్‌కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఈయన గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేయడం గమనార్హం.

కడపలో వైకాపా కుట్రలు

  •  కమలాపురంలో వైకాపా నాయకుడు రాజోలి వీరనారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వైకాపా నాయకులే ఆయనతో నామినేషన్‌ వేయించి గాజు గ్లాసు గుర్తును పొందినట్లు తెదేపా ఆరోపిస్తోంది.
  • మైదుకూరులో ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ తరఫున పోటీచేస్తున్న పి.ఆనందరావు వైకాపాలో కీలక నేత. ఈయనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
  • రాజంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చిన్న పెంచలయ్యకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఈయన వైకాపా అభ్యర్థి ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ముఖ్య అనుచరుడు.
  • మదనపల్లెలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్‌కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇక్కడ తెదేపా అభ్యర్థిగా షాజహాన్‌ బాషా ఉండగా, అదే పేరుతో స్వతంత్ర అభ్యర్థి రంగంలోకి దిగారు.

లోక్‌సభ స్థానాల్లోనూ

ఒంగోలు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, బాపట్ల తదితర లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తున్న పలువురు స్వతంత్ర అభ్యర్థులకూ గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img