KTR: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌.. ఒకటి మోదీ.. మరొకటి అదానీ: కేటీఆర్‌ ఎద్దేవా

ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని.. భాజపా(BJP) రాజకీయ కక్ష సాధింపును ప్రజాకోర్టులో ఎదుర్కొంటామని భారాస(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌(KTR) అన్నారు.

Updated : 09 Mar 2023 13:41 IST

హైదరాబాద్‌: ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని.. భాజపా(BJP) రాజకీయ కక్ష సాధింపును ప్రజాకోర్టులో ఎదుర్కొంటామని భారాస(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌(KTR) అన్నారు. భాజపా నేతలపై నమోదు చేసిన కేసులను ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు చూపించగలవా? అని ఆయన సవాల్‌ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ(PM Modi), భాజపా వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్సీ కవిత చట్టాన్ని గౌరవిస్తారని.. ఈడీ విచారణను సమర్థంగా ఎదుర్కొంటారని చెప్పారు. మోదీకి పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ బినామీ అని ఆరోపించారు. ఈ ఆరోపణలపై లైడిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమా? అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. 

‘‘ఈ 9 ఏళ్ల భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. భారాస నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. మా పార్టీకి చెందిన 12 మంది నాయకులపైకి సీబీఐ, ఈడీని పంపించారు. అవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు. ప్రతిపక్షాలపై కేసులతో.. ప్రజలపై ధరలతో దాడి చేస్తున్నారు. పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ, మోదీ చీకటి స్నేహం గురించి అందరికీ తెలుసు. అదానీ ఎవరని చిన్న పిల్లాడిని అడిగినా మోదీ బినామీ అని చెబుతాడు. ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల డ్రగ్స్‌ దొరికినా అదానీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 

ఇతర పార్టీల నేతలు భాజపాలో చేరగానే కేసులు ఏమైపోతున్నాయ్‌? సుజనా చౌదరిపై రూ.6వేల కోట్ల కేసు ఏమైంది? అదానీపై కేసులు ఏమయ్యాయి? డబుల్‌ ఇంజిన్‌ సర్కార్ అంటే ఒక ఇంజిన్‌ మోదీ.. మరో ఇంజిన్‌ అదానీ. ఆయనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పాలసీ చేసింది.. స్కామ్‌ అంటే అదీ. అదానీ పోర్ట్‌లో డ్రగ్స్‌ దొరికితే స్కామ్‌ కాదా? ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా నేత బీఎల్‌ సంతోష్‌ను విచారణకు పిలిస్తే దాక్కున్నారు. కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని పత్రికలు చెబుతున్నాయి. భాజపాలో ఉన్నవాళ్లంతా హరిశ్చంద్రుడి సోదర సోదరీమణులా? అదానీపై శ్రీలంక చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్రజల ముందుకొచ్చి చెప్పగలరా?’’ అని కేటీఆర్‌ నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని