కోచ్‌‌బిహార్‌ ఘటన ‘మారణహోమమే’: దీదీ

పశ్చిమబెంగాల్‌లోని కోచ్‌బిహార్‌లో శనివారం నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్ని సీఎం మమతా బెనర్జీ మారణహోమంగా పేర్కొన్నారు.

Updated : 11 Apr 2021 14:04 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోచ్‌‌బిహార్‌లో శనివారం నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్ని సీఎం మమతా బెనర్జీ మారణహోమంగా పేర్కొన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలను కలిసేందుకు రాజకీయ నేతలు వెళ్లకుండా ఈసీ ఆదేశించడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు దీదీ ఆదివారం సిలిగురిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె దేశంలో అసమర్థ ప్రభుత్వం నెలకొందంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. 

సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కేంద్ర పరిశ్రమల పరిరక్షణ అంశానికి సంబంధించిన వారని.. అల్లర్లను అదుపుచేసే విషయంలో వారికి అనుభవం ఉండదని దీదీ పేర్కొన్నారు. ‘అల్లర్లు చోటుచేసుకున్నపుడు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముందుగా లాఠీఛార్జి చేయడం, లేదా టియర్‌ గ్యాస్‌, జలఫిరంగులు ప్రయోగించాలి. అదీ కుదరకపోతే అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలకు పోవాలి. కానీ నిన్న కోచ్‌బెహర్‌లో సీఐఎస్‌ఎఫ్‌ జరిపిన కాల్పుల్లో మరణించిన బాధితులకు మెడ, ఛాతి భాగాల్లో బుల్లెట్లు దిగాయి’ అని మమతా పేర్కొన్నారు. 

‘భద్రతా బలగాల కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు నేను ఈరోజు అక్కడికి వెళ్లాలనుకున్నా. కానీ ఆ ప్రాంతంలోకి రాజకీయ నాయకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌(ఎంసీసీ) కాస్తా.. మోదీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌గా మారింది’ అని మమతా విమర్శలు చేశారు.

బెంగాల్‌లో శనివారం నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోచ్‌‌బిహార్‌ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సీతల్‌కూచి 126 పోలింగ్‌ కేంద్రం వద్ద భద్రతా దళాలు కాల్పులు జరపగా నలుగురు మృతి చెందారు. అల్లర్ల సమయంలో గ్రామస్థులు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారు. అందుకే ఆత్మరక్షణలో భాగంగా సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కాల్పులు జరిపారని ప్రత్యేక పోలీసు అధికారి వివేక్‌ దూబే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని