Rahul Gandhi: ఇలాంటివి సాధ్యమని నేను ఊహించలేదు: రాహుల్‌ గాంధీ

లోకసభ సభ్యత్వ రద్దును తాను ఊహించలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated : 01 Jun 2023 13:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో లోక్‌సభ సభ్యత్వం రద్దును తాను ఊహించలేదని కాంగ్రెస్‌ (Congress ) నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత సంతతి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానిపై బుధవారం రాహుల్‌ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌(Stanford University )లో మాట్లాడుతూ  ‘‘నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో.. వేటిని ఎదుర్కోవాల్సి వస్తుందో అస్సలు ఊహించలేదు. అసలు ఇలా జరుగుతుందని (లోక్‌సభ సభ్యత్వం రద్దు) అసలు అనుకోలేదు. కానీ, ఆ తర్వాత దీనిని నాకు లభించిన పెద్ద అవకాశంగా భావించా. నాకు లభించిన వాటిల్లో ఇదే పెద్ద అవకాశం. రాజకీయాలంటే అలానే ఉంటాయి’’ అని అన్నారు.

ఇక భారత్‌ జోడో యాత్రపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ఈ కథ ఆరు నెలల క్రితం మొదలైంది. అప్పట్లో మేం ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిపక్షాలన్నీ చిక్కుల్లో ఉన్నాయి. అధికార పక్ష ఆర్థిక ఆధిపత్యం, సంస్థాగత పెత్తనం నడుస్తున్నాయి. మా దేశంలోనే మేం ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి అవస్థలు పడుతున్నాం. ఆ సమయంలో భారత్‌ జోడో యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని పేర్కొన్నారు. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో భారత్‌ నుంచి వచ్చిన విద్యార్థులతో సత్సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వారితో తాను ముచ్చటించడానికి ఇది మంచి సమయమని అభిప్రాయపడ్డారు. భారత్‌- చైనా సంబంధాలు అంత సులువుకాదని.. కఠినంగా ఉండబోతున్నాయని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ను వెనక్కి నెట్టడం చైనాకు సాధ్యం కాదని చెప్పారు.

దేవుడి కంటే తమకే ఎక్కువ తెలుసని భారత్‌లో కొంతమంది భావిస్తుంటారని, అలాంటి ఓ ప్రత్యేక మనిషిగా ప్రధాని మోదీ నిలుస్తారని రాహుల్‌గాంధీ బుధవారం ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా నిన్న కాలిఫోర్నియాలోని శాంతాక్లారాలో ‘ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ యూఎస్‌ఏ’ నిర్వహించిన ‘మొహబ్బత్‌ కీ దుకాణ్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

నా ఫోన్‌ ట్యాప్‌ చేశారని తెలుసు..

రాహుల్‌ నిన్న శాన్‌ఫ్రాన్సిస్కోలో సిలికాన్‌ వ్యాలీలోని స్టార్టప్‌ ఎంటర్‌ప్రెన్యూర్లతో టెక్నాలజీ, డ్రోన్లు వంటి అంశాలపై మాట్లాడూతూ... భారత్‌లో మీరు ఎటువంటి టెక్నాలజీ అయినా వ్యాప్తి చేయాలనుకుంటే.. అధికార వికేంద్రీకరణ కలిగి ఉండాలన్నారు. డ్రోన్‌ వంటి టెక్నాలజీలు అధికారిక నిబంధనల అడ్డంకిని ఎదుర్కొంటాయని తెలిపారు. డేటా సురక్షితకు సరైన నిబంధనలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పెగసస్‌ వంటి టెక్నాలజీలకు తాను భయపడనని రాహుల్‌ తెలిపారు. తన ఫోన్‌ హ్యాక్‌ అయిందన్న విషయం తెలుసన్నారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా తన ఫోన్‌ తీసుకొని ‘హలో మోదీ’ అని అన్నారు. డేటా ప్రైవసీకి బలమైన నిబంధనలు ఏర్పాటు చేయాలన్నారు. ‘‘ఒక వేళ ప్రభుత్వం మీ ఫోన్‌ ట్యాప్‌ చేయాలని నిర్ణయిస్తే ఎవరూ ఆపలేరు’’ అని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని