Akhilesh Yadav: సార్వత్రికంలో NDA ఓటమికి అఖిలేశ్‌ ఫార్ములా

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించాలంటే పీడీఏ ఫార్ములాతోనే సాధ్యమని అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. యూపీలో భాజపాను ఓడిస్తే ఆ పార్టీ పనైపోయినట్లేనని చెప్పారు.

Updated : 17 Jun 2023 19:53 IST

లఖ్‌నవూ: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ఒకే తాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) ఎన్డీయేను ఓడించేందుకు కొత్త ఫార్ములాను సూచించారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు కలిస్తే ఎన్డీయేను సులువుగా ఓడించొచ్చని చెప్పారు. యూపీలోని 80 సీట్లలో ఓడిస్తే భాజపాను పరాజయం పాలు చేయవచ్చన్నారు. ఈ మేరకు లఖ్‌నవూలో ఎన్డీటీవీ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

‘‘ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో భాజపాను ఓడించాలంటే ప్రముఖ జాతీయ పార్టీలు మాకు అండగా ఉండాలి. యూపీలో భాజపాను ఓడిస్తే ఆ పార్టీ పనైపోయినట్లే. అలాగే, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో చూసుకుని దానిబట్టి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం జరగాలి’’ అని అఖిలేశ్‌ సూచించారు. ఈ సందర్భంగా విపక్షాల ఐక్యత గురించి ఆయనను ప్రశ్నించగా.. ‘‘80 సీట్లలో ఓడించండి.. భాజపాను సాగనంపండి’’ అని నినాదం ఇచ్చారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 లోక్‌సభ సీట్లు ఉండగా.. 2019 ఎన్నికల్లో ఎస్పీ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆ ఐదింట్లో ఇటీవల రామ్‌పూర్‌, అజంఘడ్‌ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కోల్పోయింది. భాజపా ఆ రెండు సీట్లను దక్కించుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుపై అఖిలేశ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిత్రపక్షాల విషయంలో తామెప్పుడూ నిజాయతీగా వ్యవహరిస్తామని చెప్పారు. సీట్ల గురించి కలహించుకునే పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలోనూ, శాంతిభద్రతలను కాపాడడంలోనూ యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ విఫలమైందని ఈ సందర్భంగా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని