పవార్‌ నివాసంలో ముగిసిన కీలక నేతల భేటీ!

ఎన్సీపీ అగ్రనేత శరద్‌పవార్‌ నివాసంలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం ముగిసింది. భాజపాకు, మోదీకి వ్యతిరేకంగా థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించేందుకే ....

Updated : 22 Jun 2021 19:31 IST

దిల్లీ: ఎన్సీపీ అగ్రనేత శరద్‌పవార్‌ నివాసంలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం ముగిసింది. భాజపాకు, మోదీకి వ్యతిరేకంగా థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించేందుకే ఈ సమావేశం జరుగుతోందన్న ఊహాగానాల మధ్య జరిగిన ఈ భేటీలో ఎనిమిది రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో అనేక అంశాలపై చర్చించినట్టు  యశ్వంత్ సిన్హా వెల్లడించారు. ఇది రాజకీయ సమావేశం కాదని, ఒకే రకమైన ఆలోచనలు కలిగిన వ్యక్తుల మధ్య ఇంటరాక్షన్‌ అని సీపీఎం నేత నిలోత్పల్‌బసు అన్నారు. కరోనా మేనేజ్‌మెంట్‌, నిరుద్యోగం తదితర కీలక అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు.

 సమావేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌, ఆర్‌ఎల్‌డీ, వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా, సమాజ్‌వాదీ పార్టీ నేత ఘనశ్యామ్‌ తివారీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) అధ్యక్షుడు జయంత్‌ చౌదరి, ఆప్‌ నుంచి సుశీల్‌ గుప్తా, సీపీఐ నుంచి బినోయ్‌ విశ్వం, సీపీఎం నుంచి నిలోత్పల్‌ బసు దిల్లీలోని పవార్‌ నివాసంలో భేటీకి హాజరయ్యారు. వీరితో పాటు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ మాజీ నేత సంజయ్‌ ఝా, జనతాదళ్‌ (యునైటెడ్‌) నేత పవన్‌ వర్మ కూడా పాల్గొన్నారు. అలాగే, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏపీ సింగ్‌, ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌, కేసీ సింగ్ కూడా విచ్చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని