Revanth Reddy: భాజపా నేతలపై కేసుల్లేవా.. వారికి శిక్షలేవి?: రేవంత్‌ రెడ్డి

డబుల్‌ ఇంజిన్‌ అంటే ఒకటి  అదాని, రెండోది ప్రధాని అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు.

Updated : 26 Mar 2023 18:13 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అక్రమంగా అనర్హత వేటువేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అప్పీల్‌ చేసుకునేందుకు ఆయనకు సూరత్‌ కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఆగమేఘాల మీద లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసిందని మండిపడ్డారు. కోర్టు గడువిచ్చింది కాబట్టే పోలీసులు రాహుల్‌ని అరెస్టు చేయలేదని, లేకుంటే ఎప్పుడో జైల్లో పెట్టేవారన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్‌ మాట్లాడారు. డబుల్‌ ఇంజిన్‌ అంటే ఒకటి అదానీ, రెండు ప్రధాని అని విమర్శించారు. ప్రధానిగా అవకాశం వచ్చినా రాహుల్‌ గాంధీ తీసుకోలేదని చెప్పారు. అదానీపై మాట్లాడినందుకే ఆయనపై ఎంపీగా అనర్హతవేటు వేశారని ఆరోపించారు.

‘‘రాహుల్‌ గాంధీని చూస్తే నరేంద్రమోదీ భయపడుతున్నారు. భాజపా నేతలపై ఎన్ని కేసులు లేవు? క్షమాపణలు చెప్తే ఉరిశిక్ష నిలిపివేస్తామని అప్పట్లో భగత్‌సింగ్‌కు బ్రిటిష్‌వారు అన్నారు. కానీ, ఆ వీరయోధుడు అందుకు నిరాకరించారు. దేశ పౌరుషాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఉరికంబం ఎక్కారు.  అయన్ని స్ఫూర్తిగా తీసుకున్న రాహుల్‌గాంధీ కూడా చేయని తప్పునకు క్షమాపణలు చెప్పబోరు’’ అని రేవంత్‌ పునరుద్ఘాటించారు.

మోదీ విధానాలను హర్షించరు :శివాజీ

అంతకు ముందు సినీనటుడు శివాజీ మాట్లాడారు. మోదీ విధానాలను ఎవరూ హర్షించరన్నారు. ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్‌ పార్టీయేనని, రాహుల్‌ గాంధీ కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోయినప్పటికీ.. ఓట్లు వేశారని గుర్తు చేశారు. డబ్బులు ఖర్చు చేయకపోయినా.. ఓట్లు వేస్తారనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. రాహుల్‌కు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని