MLC Elections: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అక్రమాలు: వైకాపా అభ్యర్థి రవీంద్రారెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని పశ్చిమ రాయలసీమ వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. కౌంటింగ్‌ ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.

Updated : 17 Mar 2023 20:42 IST

అనంతపురం: కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల (పశ్చిమ రాయలసీమ) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌంటింగ్‌ ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తనకు వచ్చిన ఓట్లు తెదేపా అభ్యర్థికి కలుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఓటమి భయంతో కౌంటింగ్‌ నిలిపివేయాలని మధ్యాహ్నం నుంచి వైకాపా నేతలు కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో కలెక్టర్‌ నాగలక్ష్మి లేకుండా.. జేసీ కేతన్‌ గార్గ్‌ ద్వారా కౌంటింగ్‌ పర్యవేక్షణ చేయించాలని వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

1,449 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి..

కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల(పశ్చిమ రాయలసీమ) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పట్టభద్రుల స్థానానికి 49 మంది పోటీలో ఉన్నారు. పోలైన 2,45,576 ఓట్లను లెక్కించే ప్రక్రియ సాగుతోంది. 8వ రౌండ్‌ లెక్కింపు పూర్తయిన తర్వాత వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి 74,678 ఓట్లు, తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 73,229 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు చెల్లని ఓట్లు 15,104 గుర్తించారు. మొత్తం ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి వైకాపా అభ్యర్థి రవీంద్రారెడ్డి 1,449 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎనిమిది రౌండ్ల ద్వారా మొత్తం లెక్కించిన ఓట్లు 1, 92,018. ఎనిమిదో రౌండ్‌లో  వైకాపా అభ్యర్థి 67 ఓట్ల ఆధిక్యం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని