Shubman Gill: కొడుకును క్రికెటర్గా చూడాలని ఊరొదిలి వచ్చేసి.. గిల్ జీవితం ఇదీ!
శుభ్మన్ గిల్.. డబుల్ సెంచరీ.. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. పంజాబ్ నుంచి ఎన్నో అంచనాలతో జట్టులోకి వచ్చిన గిల్ (Shubman Gill) ఇప్పుడు అదరగొడుతున్నాడు. ఓసారి గిల్ లైఫ్ తరచి చూస్తే...
‘నా కొడుకు వికెట్ తీస్తే.. వంద రూపాయలు ఇస్తా!’..
ఓ తండ్రి ఇలా సవాలు విసిరాడు అంటే.. కొడుకు మీద, కొడుకు ఆట మీద ఎంత నమ్మకం ఉంటుందో చెప్పండి. ఈ సవాలు విసిరింది ఎవరో కాదు ఉప్పల్లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన శుభ్మన్ గిల్ తండ్రి. అయితే ఇది ఇప్పటి మాట కాదు.. శుభ్మన్ ఇంకా ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభించని తొలి రోజుల్లో జరిగింది. గిల్ డబుల్ సెంచరీతో ఇప్పుడు ఇవే మాటలు వైరల్ అవుతున్నాయి. గిల్ లైఫ్లోకి తొంగి చూస్తే.. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.
‘మూడేళ్ల పిల్లాడికి బొమ్మలు ఇవ్వాలి కానీ.. ఈ బ్యాటు బాలేంటి?’ శుభ్మన్ ఇంట్లో 20 ఏళ్ల క్రితం ఈ మాట ఎక్కువగా వినిపించేదట. ఆ మాటలకు చిన్న నవ్వు నవ్వేవారు లఖ్విందర్. ఎందుకంటే శుభ్మన్ ఎప్పుడూ బొమ్మలు కావాలి అనలేదట. బ్యాటు, బాలుంటే చాలు.. వాటితోనే రోజంతా గడిచిపోయేదట. నిద్రపోతున్నప్పుడు కూడా పక్క మీద బ్యాటు, బాల్ ఉండాల్సిందే. అంతలా చిన్నతనం నుంచే శుభ్మన్ క్రికెట్ను ప్రేమించాడట. చిన్నతనంలో ఏదో సరదాకు అడుగుతున్నాడేమో అనుకున్న లఖ్విందర్.. ఆ తర్వాత క్రికెట్ మీద కొడుకుకు ఉన్న ఆసక్తి చూసి.. ఏకంగా తన పొలంలో గ్రౌండ్, పిచ్ తయారు చేశారు.
వికెట్కి ₹100
క్రికెట్ అంటే.. ఒకరిద్దరి ఆట కాదు కదా.. అందుకే తన కొడుక్కి బౌలింగ్ వేయడానికి డబ్బులతో పోటీ పెట్టేవారు లఖ్విందర్. అప్పుడు ఆయన అన్న మాటే.. ‘నా కొడుకు వికెట్ తీస్తే.. రూ. వంద ఇస్తా’. అప్పుడు ఎంతమంది వికెట్ పడగొట్టారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం గిల్ వికెట్ కోసం అంతర్జాతీయ బౌలర్లు తెగ ప్రయత్నిస్తున్నారు. వాళ్లకు శుభ్మన్ వికెట్ దొరకడం అంత ఈజీగా కుదరడం లేదనే విషయం మీకూ తెలుసు. ఇది ప్రస్తుతం అనుకోండి.. మళ్లీ కాస్త వెనక్కి వెళ్తే.. శుభ్మన్ కోసం లఖ్విందర్ కుటుంబం చేసిన త్యాగాలు కనిపిస్తాయి.
కుటుంబమంతా ఊరొదిలి
శుభ్మన్కు క్రికెట్ మీద ఉన్న అభిమానం చూసి.. లఖ్విందర్ ఏకంగా ఊరే మారిపోయారు. తన కొడుకును ప్రొఫెషనల్ క్రికెటర్ను చేయాలనే తమ కల కోసం మొహాలీకి షిఫ్ట్ అయిపోయింది శుభ్మన్ కుటుంబం. అక్కడ ఓ స్కూల్లో కోచింగ్ తీసుకోవడం ప్రారంభించి.. ఆ తర్వాత పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అకాడెమీలో చేరాడు శుభ్మన్. కొడుకు క్రికెట్ అంటే లఖ్విందర్కు ఎంత ఇష్టమో.. తండ్రి వ్యవసాయం అంటే శుభ్మన్కూ అంతే ఇష్టం. అందుకే తన పల్లెటూరు (పంజాబ్లోని ఫజిల్కా గ్రామం) రోజుల్ని శుభ్మన్ ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాడు. తండ్రిలా వ్యవసాయం చేయాలనేది గిల్ కల మరి.
తండ్రిని చూసే...
కొడుకును క్రికెటర్గా చూడాలని లఖ్విందర్ ఎంతగానో శ్రమించారు. పుట్టి, పెరిగిన ఊరును వదిలేసి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్కు దగ్గరలోనే ఇంటిలో అద్దెకు దిగారు. కొడుకు క్రికెట్ ఆడితే చాలు.. మిగిలినవన్నీ తర్వాతే అనుకునేవారు ఆయన. అనుకున్నట్లుగా శుభ్మన్ ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యాడు. ఒక్కో అడుగు వేస్తూ.. ఇప్పుడు టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఎంతోమందిని కాకుండా తనకు జట్టులో చోటు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లకు డబుల్ సెంచరీ చేసి సమాధానం చెప్పాడు. అయితే ఇదంతా కూల్ అండ్ కామ్గా చేశాడు. తన తండ్రి కూడా ఇలానే కూల్ అండ్ కామ్గా పని చేసేవారని శుభ్మన్ అంటుంటాడు.
ఇది ట్రైలర్ మాత్రమే...
డిసెంబరు 2020లో ఆస్ట్రేలియా సిరీస్ కోసం శుభ్మన్ టెస్టుల్లోకి తొలిసారి వచ్చాడు. గబ్బాలో జరిగిన రెండో టెస్టులో 91 పరుగులు చేసి.. జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు. అక్కడికి సుమారు రెండేళ్ల తర్వాత శుభ్మన్ వన్డే అరంగేట్రం జరిగింది. ఆగస్టు 2022లో జింబాబ్వే సిరీస్ కోసం జట్టులోకి తీసుకున్నారు. టీ20ల్లోకి ఎంట్రీ ఈ ఏడాదే జరిగింది. ఇటీవల శ్రీలంక సిరీసే గిల్కి తొలి టీ20 సిరీస్. గతేడాది బంగ్లాదేశ్ టెస్టులో సెంచరీతో అదరగొట్టిన శుభ్మన్.. ఈ ఏడాది వన్డేల్లో డబుల్ సెంచరీతో తన పేరును రికార్డుల్లోకి ఎక్కించాడు. శుభ్మన్ జోరు చూస్తుంటే.. భారత క్రికెట్ కొత్త ఆశాకిరణం అంటూ మాజీలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్థానిక మ్యాచుల్లో గిల్ ఆట చూసినవాళ్లు అయితే.. ఇది ట్రైలర్ మాత్రమే.. ‘పిక్చర్ అబీ బాకీ హై దోస్త్’ అంటున్నారు.
కొడుకు క్రికెట్ కోసం పొలాన్ని మైదానం చేసి, ఊరొదిలి పట్నం వచ్చేశారు అంటే.. ఆ తండ్రి కల వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది అనే డౌట్ మీకూ వచ్చిందా.. మాకూ ఇదే డౌట్ వచ్చి చూస్తే.. క్రికెటర్ అవ్వాలనేది శుభ్మన్ తండ్రి లఖ్విందర్ కల అట. అయితే తన పరిస్థితుల కారణంగా అవ్వలేకపోయారు. కానీ తన బిడ్డను దేశం గర్వించే క్రికెటర్గా మలిచి అందించారు. ఉప్పల్లో డబుల్ సెంచరీ మనకు విజయం అందిస్తే.. తండ్రికి పుత్రోత్సాహం అందించి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.
ఇదంతా గిల్ స్టార్ క్రికెటర్ అవ్వకముందు.. ఇప్పుడు గిల్ క్రికెటర్గానే కాదు.. సోషల్ మీడియాలోనూ స్టారే. ఐపీఎల్లో అదరగొట్టిన తర్వాత యాడ్స్, అండార్స్మెంట్లతో దూసుకుపోతున్నాడు. టీమ్ ఇండియాలోకి ఎంట్రీ తర్వాత అవి ఇంకా పెరిగాయి. బాలీవుడ్ హీరోలా ఉంటాడనే పోలిక కూడా మీరు వినే ఉంటారు. వాటి గురించి మరోసారి చదువుకుందాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు