Sri Lanka Team: భారత్‌ చేతిలో ఘోర ఓటమి.. క్రికెట్ బోర్డును రద్దు చేసిన శ్రీలంక క్రీడాశాఖ

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) శ్రీలంక ఆటతీరు తన స్థాయికి తగ్గట్టుగా లేదు. మరీ ముఖ్యంగా భారత్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంక జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

Updated : 06 Nov 2023 11:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) భారత్‌ చేతిలో ఘోర పరాభవం శ్రీలంక జట్టుపై (IND vs SL) తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే శ్రీలంక క్రికెట్‌ బోర్డు కార్యదర్శి రాజీనామా చేయగా.. తాజాగా ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న క్రికెట్‌ బోర్డును (SLCB) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు క్రీడల మంత్రి రోషన్ రణసింగే వెల్లడించారు. మాజీ కెప్టెన్ అర్జున్‌ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని నియమిస్తున్నట్లు ఓ ప్రకటనను మంత్రిత్వ శాఖ కార్యాలయం విడుదల చేసింది. ఏడుగురు సభ్యులు కలిగిన ఈ ప్యానెల్‌లో సుప్రీం కోర్డు విశ్రాంత న్యాయమూర్తి కూడా ఉన్నారు. పాత బోర్డు కార్యదర్శిగా పని చేసిన మోహన్ డి సిల్వా రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడింది. వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో శ్రీలంక (SL vs BAN) తలపడనుంది. మ్యాచ్‌కు ముందు ఇలాంటి నిర్ణయం వెలువడటం గమనార్హం.

శ్రీలంక క్రీడల మంత్రి రోషన్‌ రణసింగే మాట్లాడుతూ.. ‘‘బోర్డులోని సభ్యులకు పదవిలో ఉండే నైతిక హక్కు లేదు. తక్షణమే వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బాగుండేది. బోర్డులో అవినీతి మితిమీరింది. దీంతో బోర్డును తొలగించాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని వెల్లడించారు. ఘోర ఓటములతో బోర్డుపై విమర్శలు రావడంతో కార్యాలయంపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన కొలంబో పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది.

ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 358 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ఘోరంగా విఫలమైంది. టీమ్‌ఇండియా బౌలర్ల దెబ్బకు కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు రేగాయి. వరల్డ్ కప్‌ చరిత్రలోనే నాలుగో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా అవతరించింది. అంతకుముందు ఆసియా కప్‌ ఫైనల్‌లోనూ 50 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని