Tokyo Olympics: సెమీస్‌ పోరులో సింధు ఓటమి..

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో జరిగిన సెమీఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమిపాలైంది. చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది....

Updated : 31 Jul 2021 18:41 IST

కాంస్య పతకానికి మరో అవకాశం..

టోక్యో: ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో జరిగిన సెమీఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమిపాలైంది. చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకపడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జు తర్వాత సింధూకు గట్టి పోటీ ఇచ్చింది. దాంతో తొలి గేమ్‌లో సింధు ఓటమిపాలైంది. ఇక రెండో గేమ్‌లోనూ మరింత పట్టుదలగా ఆడిన తై జు.. భారత షట్లర్‌కు ఏ అవకాశం ఇవ్వలేదు. దాంతో సింధు రెండు వరుస గేమ్స్‌లో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా సింధు పతకం సాధించేందుకు మరో అవకాశం ఉంది. మరో సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైన చైనా క్రీడాకారిణి హి బింగ్ జియావోతో ఆదివారం సాయంత్రం తలపడనుంది. అక్కడ గెలిస్తే సింధు కాంస్యం సాధించే అవకాశం ఉంది. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో ఈ స్టార్‌ షట్లర్‌ రజతం సాధించిన సంగతి తెలిసిందే.

మరోవైపు తై జు యింగ్‌ చేతిలో సింధూకు ఇది 14వ ఓటమి కావడం గమనార్హం. ఇప్పటివరకు వీరిద్దరూ 19 సార్లు తలపడగా సింధు 5 సార్లు మాత్రమే ఆమెపై విజయం సాధించింది. అలాగే ఇటీవల పోటీపడిన గత మూడు పోటీల్లోనూ తై జు చేతిలో పరాభవం ఎదుర్కొంది. కాగా, సింధు శుక్రవారం క్వార్టర్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగూచిపై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్కడ సింధు 21-13, 22-20తో గెలుపొందింది. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ సెమీస్‌లో అడుగుపెట్టిన స్టార్‌ షట్లర్‌ అనూహ్య రీతిలో ఓటమిపాలైంది.

తైజు నెం.1 అని గుర్తు పెట్టుకోవాలి!

టోక్యో ఒలింపిక్స్‌ సెమీస్‌లో పీవీ సింధు ఓడిపోవటంపై ఆమె తండ్రి రమణ స్పందించారు. ‘సెమీస్‌లో తైజు చాలా వ్యూహాత్మకంగా ఆడింది. సింధు దూకుడుగా ఆడేందుకు తైజు అవకాశం ఇవ్వలేదు. ఆమె ప్రపంచ నెం.1 అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువసేపు ర్యాలీలు ఆడకుండా తైజు జాగ్రత్తపడింది. సింధు రేపు బాగా ఆడి కాంస్యం సాధిస్తుందని భావిస్తున్నా’ అని రమణ ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు