
మొన్న పద్మశ్రీ అవార్డు స్వీకరణ.. నిన్న సీఎం ఇంటి ముందు ధర్నా
చండీగఢ్: ప్రశ్నించే గొంతుకలా మారారు పారా రెజర్ల్ వీరేందర్ సింగ్. మంగళవారం రాష్ర్టపతి భవన్లో పౌర అవార్డుల ప్రదానోత్సవంలో ‘పద్మశ్రీ’ తీసుకున్న వీరేందర్ సింగ్.. బుధవారం హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు పారా అథ్లెట్లకు న్యాయం చేయండంటూ నిరసన చేపట్టారు. తాను పొందిన అర్జున అవార్డు, పద్మ పురస్కారం, ఇతర మెడల్స్ని వెంట తీసుకొచ్చి సీఎం నివాసం ముందు కూర్చొని న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ట్విటర్ వేదికగా ఇదే విషయాన్ని పంచుకున్నారాయన .
‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఖట్టర్ గారు! కేంద్రం మాకు (పారా అథ్లెట్లకు) సమాన హక్కులు కల్పిస్తున్నప్పుడు హరియాణా ప్రభుత్వం మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు? బధిర క్రీడాకారులకు పారా క్రీడాకారులతో సమాన హక్కులు కల్పించేంత వరకు మీ నివాసమైన దిల్లీ హరియాణా భవన్ ఫుట్పాత్ నుంచి కదలను’’ అన్నారు. మరోవైపు రాష్ర్టం నుంచి పారా రెజ్లర్ వీరేందర్ సింగ్కి ‘పద్మశ్రీ’ అవార్డు దక్కడమనేది రాష్ర్టానికే గర్వకారణం.. అభినందనలు చెబుతూ సీఎం ఖట్టర్ ట్వీట్ చేశారు. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ది డెఫ్ (ICSD) బధిరుల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహిస్తున్నప్పటికీ.. వారికంటూ ప్రత్యేకంగా పారాలింపిక్ కేటగిరీలు లేవు. డెఫ్లింపిక్స్ అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ గుర్తించినా, బధిర అథ్లెట్లు మాత్రం అత్యంత ప్రసిద్ధ పారాలింపిక్ క్రీడల్లో భాగం కాలేదు.