Facebook: ఒకే అకౌంట్‌తో ఐదు ప్రొఫైల్స్‌.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్‌!

ఫేస్‌బుక్‌లో కుటుంబసభ్యుల కోసం, ఫ్రెండ్స్‌ కోసం అంటూ వేర్వేరు సోషల్‌ మీడియా ఖాతాలను ఉపయోగించే వారికి మెటా సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫేస్‌బుక్‌లో ఒకే ఖాతాతో ఐదు ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు తెలిపింది.

Updated : 16 Jul 2022 12:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షేరెంట్‌.. ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచిన పాపులర్‌ పది ఆంగ్ల పదాల్లో ఇది ఒకటి. ఇంతకీ షేరెంట్‌ అర్థం తెలుసా? సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు పిల్లలతో సమాచారం పంచుకునే తల్లిదండ్రులను షేరెంట్‌ అని పిలుస్తారట. అవును మరి, సామాజిక మాధ్యమాల వినియోగం ఎంతో పాపులరో అనేందుకు ఇదో ఉదాహరణ. 

సోషల్‌ మీడియాలో పిల్లలపై నిఘా పెట్టేందుకు తల్లిదండ్రులు వారికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతుంటారు. పిల్లలు మాత్రం తమ సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌ జాబితాలో తల్లిదండ్రులు ఉండకూడదని కోరుకుంటారు. దీంతో కుటుంబసభ్యుల కోసం, ఫ్రెండ్స్‌ కోసం అంటూ వేర్వేరు సోషల్‌ మీడియా ఖాతాలను ఉపయోగిస్తుంటారు. అలాంటి వారికి మెటా సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫేస్‌బుక్‌లో ఒకే ఖాతాతో ఐదు ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉందని, త్వరలోనే యూజర్లకు పరిచయం చేస్తామని మెటా సంస్థ వెల్లడించింది.   

‘‘సోషల్ మీడియాలో తమకు నచ్చిన కంటెంట్‌ను షేర్‌ చేయడంలో కొంత మంది యూజర్లు ఫ్రెండ్స్‌ జాబితాలో కుటుంబసభ్యులు, బంధువులు ఉన్నారనే కారణంతో సంకోచిస్తుంటారు. దీంతో వారు తమ ఇష్టాయిష్టాలకు అనుకూలంగా ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు ఉపయోగిస్తున్నారు. అలాంటి వారు ఒకే ఖాతాతో ఐదు వేర్వేరు ప్రొఫైల్స్‌ పెట్టుకునేలా కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నాం’’ అని మెటా  సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ ఫీచర్‌లో యూజర్లు ఫేస్‌బుక్‌ ఖాతా ఏ పేరుతో క్రియేట్ చేశారో అదే ప్రైమరీ ప్రొఫైల్‌ పేరుగా ఉంటుంది. మిగిలిన నాలుగు ప్రొఫైల్స్‌కు యూజర్లు తమకు నచ్చిన పేరును పెట్టుకోవచ్చు. అయితే వీటిలో కేవలం అక్షరాలు మాత్రమే ఉండాలి. నంబర్లు, స్పెషల్‌ క్యారెక్టర్లు ఉండకూడదు. ఎవరైనా యూజర్‌ తమ అడిషనల్‌ ప్రొఫైల్స్‌తో ఫేస్‌బుక్‌ పాలసీలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తిస్తే వారి ప్రొఫైల్స్‌ను తొలగిస్తామని మెటా సంస్థ తెలిపింది. టిక్‌టాక్‌, ట్విటర్‌ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్‌ను యూజర్లకు మరింత చేరువచేయాలనే ఉద్దేశంతో మెటా సంస్థ ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని