ఇరవై రెండేళ్లైంది.. క్రమబద్ధీకరించండి

తాము ఇరవై రెండేళ్లుగా ఒప్పంద అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, నాయకుడు జి.మధుసూదనరెడ్డి శనివారం మంత్రి హరీశ్‌ను కోరారు.

Updated : 26 Mar 2023 05:01 IST

మంత్రి హరీశ్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: తాము ఇరవై రెండేళ్లుగా ఒప్పంద అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, నాయకుడు జి.మధుసూదనరెడ్డి శనివారం మంత్రి హరీశ్‌ను కోరారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జాబితాలో తామూ ఉన్నామని, విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి పంపిన జాబితాలో అదనపు విద్యార్హతలున్న 246 మంది పేర్లు మాత్రమే ఉన్నాయన్నారు. అదనపు విద్యార్హతలకు సంబంధించి ప్రభుత్వం సడలింపులిచ్చిందని, ప్రభుత్వ అధ్యాపకులుగా విధుల్లోకి చేరిన అయిదేళ్లలోపు అదనపు అర్హతలు సంపాదించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొందని వివరించారు. నాలుగేళ్ల క్రితం జీవో నంబరు 10 ద్వారా మిర్యాలగూడలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న 30 మంది అధ్యాపకులను అదనపు అర్హతలు లేకున్నా క్రమబద్ధీకరించారన్నారు.

వేతనాల విడుదలకు గోపాలమిత్రల వినతి

రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు 11 నెలలుగా పెండింగులో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని టీఎన్జీవోల అనుబంధ గోపాలమిత్రల సంఘం ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ నేతృత్వంలో ప్రతినిధులు మంత్రిని శనివారం ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు 2022 మార్చి నుంచి జీతాలు అండడం లేదని, 30% వేతనాలను పెంచినా అది అమలు కావడం లేదని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని