Afghanistan: ఉగ్రవాదం నుంచి ప్రభుత్వాధికారులుగా.. తాలిబన్లలోనూ క్వైట్‌ క్విట్టింగ్‌!

అంతకముందు వరకు యుద్ధంలో భాగంగా గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో నివసించిన తాలిబన్లు(Taliban) ప్రభుత్వ విధుల్లో భాగంగా కాబూల్‌కు వచ్చారు. కానీ, అక్కడి జీవనశైలి వారికి కష్టంగా ఉండంతో తమకు అప్పగించిన బాధ్యతల నుంచి క్వైట్‌ క్విట్టింగ్ (Quiet Quitting) చేస్తున్నారట.

Published : 20 Mar 2023 01:39 IST

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత తాలిబన్లు(Taliban) అధికారాన్ని హస్త గతం చేసుకున్నారు. అంతకముందు వరకు తుపాకీ చేతబట్టి సైనికుల్లా యుద్ధం చేసిన వారిలో కొందరికి.. ప్రభుత్వ నిర్వహణలో భాగంగా పలు మంత్రిత్వశాఖల్లో అదనపు భాద్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో కొందరు తాలిబన్లు నగర జీవితానికి అలవాటు పడలేకపోతున్నారని అఫ్గాన్‌ కేంద్రంగా పనిచేసే అఫ్గానిస్థాన్‌ అనలిస్ట్ నెట్‌వర్క్‌ (Afghanistan Analysts Network) అనే ఎన్జీవో సంస్థ తెలిపింది. అప్పటి వరకు యుద్ధంలో భాగంగా గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో నివసించిన తాలిబన్లు ప్రభుత్వ విధుల్లో భాగంగా కాబూల్‌కు వచ్చారు. అయితే, అక్కడి జీవనశైలి వారికి కష్టంగా ఉండంతో తమకు అప్పగించిన బాధ్యతల నుంచి క్వైట్‌ క్విట్టింగ్ (Quiet Quitting) చేస్తున్నారట. తమకు అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోవడంతో.. అది ప్రభుత్వ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఎన్జీవో వెల్లడించింది.  

నగర జీవనానికి అలవాటు పడినవారు మాత్రం విధులకు హాజరవుతున్నారు. అయితే, ఎక్కువ సమయం కార్యాలయంలో గడపాల్సి రావడం, నివేదికలు తయారు చేయడం, ఆర్థికపరమైన నిర్వహణ వంటివి వారికి కొత్తగా ఉండటంతో వారిలో కూడా కొందరు క్వైట్‌ క్విట్టింగ్‌ చేస్తున్నారట. మరీ ముఖ్యంగా ట్రాఫిక్‌ నిర్వహణ చేయలేకపోవడంతో రోడ్లపై పెద్ద ఎత్తున్న వాహనాలు ఆగిపోతున్నాయని, దీంతో సాధారణ పౌరులతోపాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్జీవో పేర్కొంది. యుద్ధం చేసేందుకు ప్రణాళికలు రచించిన వారికి ప్రభుత్వ నిర్వహణ సవాలుగా మారిందని పలువురు వాపోతున్నారట. ‘‘ప్రజలకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా తాలిబన్లనే ప్రశ్నిస్తారు. మరోవైపు, ఏ చిన్న తప్పు జరిగినా తాలిబన్లకు తప్పు చేస్తున్నారని, పరిపాలన చేతకావడంలేదని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆరోపిస్తాయి. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని మీడియా సంస్థల కెమెరాలు మావైపే చూస్తున్నాయి’’ అని తాలిబన్‌ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని