America: అమెరికా పౌరులారా.. వెంటనే రష్యాను వీడండి!

ఒకవైపు ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం, మరోవైపు అక్రమ అరెస్టులు, నిర్బంధాల ముప్పు నేపథ్యంలో వెంటనే రష్యాను వీడాలని అమెరికా తన పౌరులకు సూచించింది. కీవ్‌- మాస్కోల యుద్ధానికి ఏడాది సమీపిస్తోన్న వేళ ఈ ప్రకటన చేసింది.

Updated : 13 Feb 2023 17:07 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు(Ukraine Crisis) ఏడాది సమీపిస్తోన్న వేళ అమెరికా(America) కీలక ప్రకటన చేసింది. రష్యా(Russia)లోని అమెరికన్లందరూ(America Citizens) వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఉక్రెయిన్‌(Ukraine)లో ఇరుపక్షాల మధ్య తీవ్రతరమవుతోన్న దాడులతోపాటు రష్యన్ భద్రతాసంస్థల నుంచి ఏకపక్ష అరెస్టులు, వేధింపుల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.

‘రష్యాలో నివసిస్తున్న లేదా పర్యటిస్తోన్న అమెరికా జాతీయులు వెంటనే దేశాన్ని వీడి బయలుదేరాలి’ అని మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. తప్పుడు నిర్బంధాల అవకాశం నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. దీంతోపాటు అమెరికన్లను రష్యాకు వెళ్లొద్దని పేర్కొంది. గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే అనుమానంతో అమెరికా పౌరుడిపై క్రిమినల్ కేసు ప్రారంభించినట్లు రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(FSB) ఇటీవల తెలిపిన వేళ తాజా ప్రకటన వచ్చింది.

‘రష్యన్ భద్రతాసంస్థలు కొంతమంది అమెరికా పౌరులను తప్పుడు ఆరోపణలపై అరెస్టు చేశాయి. అమెరికన్లను నిర్బంధించడంతోపాటు వేధింపులకు పాల్పడుతున్నాయి. పైగా, వారికి న్యాయమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు నిరాకరించాయి. సరైన సాక్ష్యాలు సమర్పించకుండానే రహస్య విచారణల్లో వారిని దోషులుగా తేల్చాయి’ అని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ముఖ్యంగా అమెరికన్‌ మత బోధకులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాను విడిచి వెళ్లాలని అమెరికా తన పౌరులను గతంలోనూ పలుమార్లు హెచ్చరించింది. చివరగా గతేడాది సెప్టెంబరులో రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక సమీకరణకు ఆదేశించిన సమయంలో ఈ మేరకు ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా.. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించిన విషయం తెలిసిందే. క్షిపణులు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడుతుండగా.. అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల సాయంతో మాస్కో బలగాలను కీవ్‌ దీటుగా ఎదుర్కొంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని