Rishi Sunak: రిషి సునాక్‌ ‘పెన్ను’పై వివాదం

బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస విమర్శలను ఎదుర్కొంటున్న రిషి సునాక్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.

Updated : 29 Jun 2023 07:14 IST

 రాసింది తుడిచేందుకు వీలుండటమే కారణం

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస విమర్శలను ఎదుర్కొంటున్న రిషి సునాక్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. సునాక్‌ గతంలో ఛాన్సలర్‌గా ఉన్న సమయం నుంచి రాసిన దాన్ని తుడిచేసే వీలు కల డిస్పోజబుల్‌ ‘పైలట్‌ వి’ పెన్నులను వినియోగిస్తున్నారు. ప్రధాని అయిన తర్వాతా అవే పెన్నులను అధికారిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నారు. 15 రోజుల క్రితం కేబినెట్‌ సమావేశంలోనూ సునాక్‌ చేతిలో ఈ పెన్ను కనిపించింది. ఇటీవల మాల్డోవాలో జరిగిన యూరోపియన్‌ పొలిటికల్‌ కమ్యూనిటీ సమావేశంలో అధికారిక పత్రాలపైనా ఇదే పెన్నుతో సంతకాలు చేశారు. దీంతో ఈ పెన్నుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పెన్నుతో రాసినవి తుడిచేసే వీలు ఉండటంతో ఇది భద్రతాపరంగా అంత సురక్షితం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ‘ది గార్డియన్‌’ పత్రిక తన కథనంలో వెల్లడించింది.

అన్ని పత్రాలు భద్రంగా ఉంచుకుంటారు

అయితే దీనిపై 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని విశ్వసనీయ వర్గాలు స్పందిస్తూ.. ప్రధాని తనకు సంబంధించిన అన్ని పత్రాలను భద్రంగా ఉంచుకుంటారని తెలిపారు. అటు సునాక్‌ మీడియా కార్యదర్శి మాట్లాడుతూ.. ‘‘ఈ పెన్నును సివిల్‌ సర్వీస్‌లో విరివిగా వినియోగిస్తారు. ప్రధాని ఎప్పుడూ ఈ పెన్నుతో వాక్యాలను రాసి తుడిచేసే ప్రయత్నం చేయలేదు. భవిష్యత్తులో చేయరు కూడా..!’’ అని తెలిపారు. కాగా.. బ్రిటన్‌లో ఈ పెన్ను ధర 4.75 పౌండ్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.495.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని