S Jaishankar: జర్మనీ ఛాన్స్‌లర్‌ నోట.. భారత మంత్రి మాట..!

గతేడాది భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌(S Jaishankar) స్లొవాకియాలో చేసిన వ్యాఖ్యలను ఐరోపా దేశాల పెద్ద నేతలు ఇప్పటికీ మర్చిపోలేదు. తాజాగా మ్యూనిక్‌లో జరిగిన సదస్సులో మళ్లీ అవి చర్చకు వచ్చాయి.  

Updated : 20 Feb 2023 10:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత (India) విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌(S Jaishankar) గతేడాది ఓ సదస్సులో ఐరోపా దేశాలను విమర్శిస్తూ ‘యూరోపియన్‌ మైండ్‌సెట్‌’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఆయా దేశాధినేతలు గుర్తించుకున్నారు. తాజాగా జర్మనీ(germany)లోని మ్యూనిక్‌లో జరిగిన రక్షణ సదస్సులో ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఈ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీనిలో ఓ సద్విమర్శ ఉందన్న విషయాన్ని అంగీకరించారు.

ఈ సందర్భంగా షోల్జ్‌ మాట్లాడుతూ ‘‘మైండ్‌సెట్‌లో మార్పు అవసరం. సమష్టి చర్యల విషయంలో ఉత్తర అమెరికా, ఐరోపా.. బయట దేశాల ప్రయోజానాలు, ఆందోళనలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలతో కలిసి  పెరుగుతున్న పేదరికం, ఆకలి, కొవిడ్‌ ప్రభావం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం వంటి సమస్యల పరిష్కారంపై పనిచేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. 

గతేడాది స్లొవాకియాలో జరిగిన ఓ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై అడిగిన ఓ ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘‘ఐరోపా సమస్యలు మాత్రమే ప్రపంచ సమస్యలని.. ప్రపంచ సమస్యలు ఐరోపా సమస్యలు కాదని భావించే మైండ్‌సెట్‌ నుంచి ఐరోపా బయటకు రావాలి. అది మీ సమస్య అయితే మీదే.. మా సమస్య అయితే మాదే’’ అని  తేల్చిచెప్పారు. అంతేకాదు.. ఉక్రెయిన్‌ యుద్ధం కంటే ముందే భారత్‌-చైనా సంబంధాల మధ్య నెలకొన్న పరిస్థితిని కూడా ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని