Elon Musk: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం: ఎలాన్‌ మస్క్‌

Elon Musk: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు.. ఐరాస భద్రతా మండలిలో ఇప్పటివరకు శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం అని టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 23 Jan 2024 13:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐక్యరాజ్యసమితి (United Nations) పనితీరుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్నారు. ఈ సందర్భంగా భద్రతా మండలి (Security Council)లో భారత్‌ (India)కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. అసలేం జరిగిందంటే..

ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఇటీవల ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. భద్రతా మండలిలో ఏ ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, 80 ఏళ్ల కిందటి మాదిరిగా ఇప్పటికీ కొనసాగకూడదని అభిప్రాయపడ్డారు. దీంతో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై చర్చ మొదలైంది.

భవిష్యత్‌ తరాలు మనల్ని క్షమించకపోవచ్చు: WHO చీఫ్‌ హెచ్చరిక

ఈ పోస్ట్‌కు అమెరికాకు చెందిన పెట్టుబడిదారు మైఖెల్‌ ఐసెన్‌బర్గ్‌ బదులిస్తూ.. ‘మరి భారత్‌ సంగతేంటీ?’ అని ప్రశ్నించారు. దీనికి ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ.. ‘‘ఐరాస, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డారు.

ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐరాస ఆవిర్భవించింది. దీనికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది. నాటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో మాత్రం ఎలాంటి మార్పులూ చోటుచేసుకోలేదు. వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ పట్టుబడుతున్నా.. అందుకు అనుగుణంగా ఎలాంటి మార్పులు జరగట్లేదు. ఐదింట నాలుగు దేశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నా.. ఒక్క చైనా మాత్రం మోకాలడ్డుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని