బైడెన్‌ను చంపాలని.. 6 నెలలు ప్లాన్‌ చేసి..: సాయివర్షిత్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

అమెరికా (USA) అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ (White House) పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకువచ్చిన ఓ 19 ఏళ్ల యువకుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు బైడెన్‌ను హత్య చేయాలన్న లక్ష్యంతోనే తాను ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు.

Updated : 24 May 2023 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా (USA) అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ (White House) వద్ద ఓ యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడైన తెలుగు సంతతి వ్యక్తి 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ (Kandula Sai Varshith)ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్షుడు జో బైడెన్‌ (President Joe Biden)ను హత్య చేయాలనే లక్ష్యంతో నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్లు తెలిసింది. ఇందుకోసం అతడు ఆరు నెలలుగా ప్లాన్‌ చేసి మరీ ఘటనకు పాల్పడినట్లు తేలింది. ఈ విషయాన్ని సాయి వర్షిత్‌ విచారణలో అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీస్‌ ఏజెంట్ వర్గాలు మీడియాకు తెలిపాయి.

అమెరికా (USA) కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించారు. దాని ప్రకారం.. సాయి వర్షిత్‌ సోమవారం రాత్రి సెయింట్‌ లూయిస్‌ నుంచి వాషింగ్టన్‌లోని డ్యుల్లెస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఆ తర్వాత U-Haul సంస్థ నుంచి ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్‌హౌస్‌ (White House) వెలుపల ఉన్న సైడ్‌వాక్‌ వద్దకు వెళ్లాడు. అక్కడ శ్వేతసౌధం ఉత్తరభాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్‌ చేసి మరోసారి ఢీకొట్టాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో సాయి వర్షిత్‌ చెప్పిన విషయాలకు పోలీసులే కంగుతిన్నారట. ఈ దాడి కోసం తాను ఆరు నెలలుగా ప్లాన్‌ చేసినట్లు అతడు చెప్పాడు. దాడికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన గ్రీన్‌బుక్‌లో రాసుకొన్నట్లు తెలిపాడు. ‘‘శ్వేతసౌధంలోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే నా లక్ష్యం’’ అని నిందితుడు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే అధికారాన్ని ఎలా దక్కించుకుంటావని సీక్రెట్ సర్వీస్‌ ఏజెంట్స్‌ అడగ్గా.. ‘‘అవసరమైతే బైడెన్‌ను చంపేయాలనుకున్నా. లేదా అక్కడున్న వారిలో ఎవరినైనా గాయపర్చడమో, చంపడమో చేయాలనుకున్నా’’ అని సాయివర్షిత్‌ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

సాయి వర్షిత్‌ వద్ద నాజీ జెండాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని గురించి ప్రశ్నించగా.. తాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు నిందితుడు చెప్పాడు. ‘‘హిట్లర్‌ బలమైన నేత. నాజీలకు గొప్ప చరిత్ర ఉంది’’ అని అతడు చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో, సాయి వర్షిత్‌ మానసిక పరిస్థితిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకోసం అతడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విచారించినట్లు తెలుస్తోంది.

మిస్సోరిలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌ది భారత సంతతికి చెందిన కుటుంబం. 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ప్రోగ్రామింగ్‌, కోడింగ్ లాంగ్వేజీలపై పట్టున్న అతడు.. డేటా అనలిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని చూస్తున్నట్లు అతడి లింక్డిన్‌ ప్రొఫైల్‌ ద్వారా తెలిసింది. కాగా.. నిందితుడిపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్‌ రికార్డ్‌ లేదని పోలీసులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు