మొండి బ్యాక్టీరియాపై కొత్త బాణం
యాంటీబయోటిక్ మందులకూ లొంగని మొండి బ్యాక్టీరియాను ఎదుర్కోవటానికి వైద్యులు, శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు....
యాంటీబయోటిక్ మందులకూ లొంగని మొండి బ్యాక్టీరియాను ఎదుర్కోవటానికి వైద్యులు, శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ దిశగా శాస్త్రవేత్తలు రూపొందించిన చికిత్స పద్ధతి ఒకటి సరికొత్త ఆశలు రేపుతోంది. ఎలాంటి మందులు లేకుండానే మొండి బ్యాక్టీరియా పని పట్టటం దీని ప్రత్యేకత. ఇందులో పసుపు కీలక పాత్ర పోషించటం మరింత విశేషం. పసుపులో కర్క్యుమిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది వాపు ప్రక్రియ, కణితుల నివారణకు తోడ్పడుతుంది. అందుకే శాస్త్రవేత్తలు కర్క్యుమిన్ను అతి సూక్ష్మమైన నానో గొట్టాల్లో నింపి.. ఆ గొట్టాలపై లైసోజోమ్ అనే ఎంజైమ్ పూత పూశారు. అలాగే నీటిలో కరిగిపోయే ఒకరకం చక్కెరనూ జతచేశారు. ఇలాంటి నానో గొట్టాలను పెద్ద సంఖ్యలో ఇచ్చినప్పుడు యాంటీబయోటిక్ మందులకు లొంగని హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా జీర్ణాశయంలోని కణాలకు అతుక్కోవటం ఆగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు, జీర్ణాశయ కణాలకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకకపోవటం గమనార్హం. ఇలా శాస్త్రవేత్తలు ‘సూక్ష్మం’లో మోక్షం చూపించారన్నమాట.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.