పంచాయతీ పోరు ఫిబ్రవరిలో

గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక.. షెడ్యూలు ఖరారు చేస్తామని తెలిపింది. ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించింది.

Updated : 18 Nov 2020 10:48 IST

ప్రభుత్వంతో సంప్రదించాక షెడ్యూలు
నాలుగు వారాల ముందు నుంచి కోడ్‌
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన
ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
న్యాయపరమైన ఇబ్బందులు లేవు: ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌
ఈనాడు - అమరావతి

గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక.. షెడ్యూలు ఖరారు చేస్తామని తెలిపింది. ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌   మంగళవారం ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. వాటిని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచడంతో పాటు, ఒక పత్రికా ప్రకటనా విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలకు నాలుగు వారాల ముందునుంచి కోడ్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం భారత రాజ్యాంగంలోని 243కె, 243 జెడ్‌ఏ అధికరణాల ప్రకారం తప్పనిసరన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి కాబట్టి, ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేవన్నారు. కొవిడ్‌ పరిస్థితులు ఉన్నా దేశంలో ఎక్కడెక్కడ ఎన్నికలు నిర్వహించినదీ ప్రస్తావించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గాయని, ఒకప్పుడు రోజుకు 10 వేల కేసులకు పైగా నమోదైన పరిస్థితి నుంచి, ఇప్పుడు 2 వేల కంటే తక్కువే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం తొలిసారి వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత, రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తెలుసుకున్నాకే, తగిన కొవిడ్‌ రక్షణ చర్యలు చేపడుతూ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్టు వెల్లడించారు. ‘‘ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన విధి. ఎన్నికల్ని నిరవధికంగా వాయిదా వేయలేం. క్షేత్రస్థాయిలో పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకున్న తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం. అదే విషయాన్ని మేం హైకోర్టుకూ తెలియజేశాం’’ అని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్ని, వివిధ రాష్ట్రాల్లో శాసనసభ ఉప ఎన్నికల్ని ఇటీవల నిర్వహించిన విషయాన్ని రమేశ్‌కుమార్‌ ప్రస్తావించారు. అక్కడ ఎన్నికల నిర్వహణ వల్ల కరోనా వ్యాప్తి పెరిగినట్టుగా నిర్ధారణ కాలేదన్నారు. ‘‘రాజస్థాన్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు అక్కడి యంత్రాంగం సిద్ధమైంది’’ అని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీలతో తాను నిర్వహించిన సమావేశానికి వచ్చిన పార్టీలన్నీ తగిన జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు రమేశ్‌కుమార్‌ తెలిపారు. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చి ఒక లేఖ అందజేశారని, కరోనా సెకండ్‌వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదని చెప్పారని ఆయన వెల్లడించారు. ‘‘లాక్‌డౌన్‌ 5.0 మార్గదర్శకాల అమలు, అనంతర పరిణామాలపై అక్టోబరు 27న వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించాం. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై చర్చించాం. శీతాకాలంలో కేసుల కరోనా వ్యాప్తి, కేసుల సంఖ్యపై వారి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి’’ అని పేర్కొన్నారు.

స్థానిక నాయకత్వం ఉంటే ఇంకా బాగా నియంత్రించొచ్చు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది చేసిన కృషి అత్యంత ప్రశంసనీయమని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘‘దేశంలో కరోనా నియంత్రణలో పంచాయతీలు, స్థానిక నాయకత్వం కీలకపాత్ర పోషించాయని పలు అనుభవాలు చెబుతున్నాయి. ఆ విజయగాధలు ఎన్నికల సంఘానికి ప్రేరణ కలిగించాయి. రాష్ట్రంలోనూ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే.. కరోనాను మరింత మెరుగ్గా నియంత్రించగలమని భావిస్తున్నాం’’ అని తెలిపారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్థిక సంఘం నుంచి నిధుల విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని పేర్కొన్నారు.


ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయండి

గిన కొవిడ్‌ రక్షణ చర్యలు చేపడుతూ స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి రమేశ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గ్రామపంచాయతీలు, రిజర్వేషన్ల జాబితాలను పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సిద్ధం చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ, హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసుశాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికల్ని జిల్లాల కలెక్టర్లు రూపొందించుకోవాలన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని