Chiranjeevi: రాజకీయాలకు దూరం

తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు చిరంజీవి చెప్పారు. తనకు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేశారనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా డోకిపర్రులో ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి

Updated : 15 Jan 2022 09:01 IST

నాకు రాజ్యసభ సీటు అనేది అవాస్తవం: చిరంజీవి

ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే- గన్నవరం, డోకిపర్రు: తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు చిరంజీవి చెప్పారు. తనకు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేశారనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా డోకిపర్రులో ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో గోదాదేవి కల్యాణోత్సం, సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు చిరంజీవి దంపతులు శుక్రవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చిరంజీవి గురువారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వైకాపా రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై చిరంజీవిని శుక్రవారం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘నాకు రాజ్యసభ సీటు అనే మాట స్పెక్యులేషన్‌. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. అలాంటివేవీ నా దగ్గరికి రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు ఎవరూ ఆఫర్‌ ఇవ్వరు. వాటిపై నేనేమీ సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ.. కావాలని కోరుకోవడమనేది నా అభిమతం కాదు. రాజకీయాలకు నేను పూర్తి దూరం’ అని పేర్కొన్నారు.  

‘తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం చర్చించిన విషయాల్ని పక్కదోవ పట్టించేలా, ఆ సమావేశానికి రాజకీయ రంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్టు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. దయచేసి ఊహాగానాల్ని వార్తలుగా ప్రసారం చేయవద్దు. అందుకు సంబంధించిన చర్చల్ని ఇక్కడితో ఆపాలని కోరుతున్నా’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.


గోదాదేవి కల్యాణంలో చిరంజీవి దంపతులు

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులోని భూసమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన గోదాదేవి కల్యాణంలో సినీనటుడు చిరంజీవి, సురేఖ దంపతులు పాల్గొన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆలయ వ్యవస్థాపకులైన మేఘూ ఇంజినీరింగ్‌ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి-సుధ దంపతులు ఉభయ దాతలుగా ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో చిరంజీవి దంపతులు పాల్గొని స్వామికి పూజాదికాలు చేశారు. కృష్ణారెడ్డి దంపతులు, చిరంజీవి దంపతులు కల్యాణం నిర్వహించారు. తొలుత దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్‌, డైరీలను వారు ఆవిష్కరించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. చిరంజీవిని చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని