రాజధానిలో రహదారుల విధ్వంసం

రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం కొనసాగుతోంది. అక్రమార్కులు రోడ్లను తవ్వి మట్టి, గ్రావెల్‌, కంకర, ఇసుకను తరలించుకుపోతున్నారు.

Updated : 03 Oct 2022 11:51 IST

సచివాలయం సమీపంలో రోడ్డు తవ్వి మట్టి, కంకర

తవ్వుకుపోయిన దుండగులు

తుళ్లూరు గ్రామీణం, మంగళగిరి(తాడేపల్లి), న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం కొనసాగుతోంది. అక్రమార్కులు రోడ్లను తవ్వి మట్టి, గ్రావెల్‌, కంకర, ఇసుకను తరలించుకుపోతున్నారు. తాజాగా మందడం, కురగల్లు మధ్యలో గత ప్రభుత్వంలో నిర్మించిన రహదారిని దుండగులు ధ్వంసం చేశారు. మట్టి తవ్వకాలు, రహదారుల విధ్వంసం జరిగిన ప్రాంతం రాష్ట్ర సచివాలయానికి ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇప్పటివరకు నిర్మాణంలో ఉన్న రహదారులను దుండగులు తవ్వుకుపోతే.. ఇప్పుడు నిర్మాణం పూర్తయిన తారు రోడ్లనూ ధ్వంసం చేయడం ప్రారంభించారు. యర్రబాలెం వైపు నుంచి వీఐటీ(ఏపీ) యూనివర్సిటీ వైపు సుమారు 60 అడుగుల విస్తీర్ణంలో గత ప్రభుత్వంలో డివైడరుతో కూడిన తారు రోడ్డు నిర్మించారు. ఆ మార్గంలో నిర్మాణంలో ఉన్న వంతెన సమీపంలో రహదారిపై తారును యంత్రాలతో తవ్వి పక్కనపోసి దాని కింద ఉన్న కంకర, డస్ట్‌, గ్రావెల్‌ను తరలించారు. అడుగున్నర లోతు వరకు ఉన్న కంకర డస్ట్‌ను తవ్వారు. ఒకేచోట 150 మీటర్లకు పైగా రోడ్డును తవ్వేశారు. సమీపంలో మరికొన్ని చోట్ల కొన్ని మీటర్ల మేర తవ్వారు. మందడం, కురగల్లు, యర్రబాలెం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వి తరలించుకుపోయారు. ఆ ప్రాంతంలో వాహనాలు తిరిగిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు ఈ ప్రాంతంలో దొంగలు జేసీబీలు, టిప్పర్లతో చొరబడి రహదారులను తవ్వుతున్నారని స్థానికులు తెలిపారు. ఉద్దండరాయునిపాలెం, మోదుగలింగాయపాలెం, రాయపూడి, ఐనవోలు, కృష్ణాయపాలెం, మందడం గ్రామాల పరిసర ప్రాంతాల్లో అక్రమార్కులు రహదారులను తవ్వి మట్టి, కంకర తరలించిన విషయం తెలిసిందే. స్థానికంగా ఉంటున్న ఒక ప్రజాప్రతినిధికి తెలియకుండా మట్టి, కంకర దొంగతనాలు జరగవని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజధానిలో ఇంతలా రహదారుల విధ్వంసం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని