మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలపై కఠిన చర్యలొద్దు

తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న మార్గదర్శి కేసులు తేలేదాకా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నమోదైన ఫిర్యాదులతో పాటు ఇలాంటి ఇతర ఫిర్యాదుల్లోనూ సంస్థ ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజలపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ ఏపీ ప్రభుత్వానికి మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 22 Mar 2023 07:41 IST

ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం
ఈ ఫిర్యాదులతో పాటు ఇలాంటి ఏ ఫిర్యాదుల్లోనూ చర్యలు తీసుకోవద్దు
మార్గదర్శి పిటిషన్లను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం
పెట్టుబడులు పెడితే చందాదారుల్ని మోసం చేసినట్లు కాదని వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న మార్గదర్శి కేసులు తేలేదాకా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నమోదైన ఫిర్యాదులతో పాటు ఇలాంటి ఇతర ఫిర్యాదుల్లోనూ సంస్థ ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజలపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ ఏపీ ప్రభుత్వానికి మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి వివాదానికి సంబంధించి ఇప్పటికే రెండు పిటిషన్‌లు ఇదే కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో భిన్నమైన ఉత్తర్వులు రాకుండా నివారించడానికి అన్నింటినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అందువల్ల వాటితో జత చేయడానికి వీలుగా మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలు దాఖలు చేసిన పిటిషన్‌లను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మార్గదర్శికి వ్యతిరేకంగా నాలుగు నెలల క్రితం పత్రికా ప్రకటనలు వెలువడినా ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయలేదని, అంతేగాకుండా చిట్‌ఫండ్‌ వ్యాపారానికి సంబంధించిన అన్ని పత్రాలు అందుబాటులో ఉన్నందున ఛైర్మన్‌, ఎండీలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. ఏపీలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ  మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలు దాఖలు చేసిన పిటిషన్‌లపై సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్‌ కె.సురేందర్‌ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది నవంబరులో సోదాలు నిర్వహించిన నాలుగు నెలల తరువాత కేసులు నమోదు చేయడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. మార్గదర్శి నుంచి చిట్‌ మొత్తం గానీ, మరే ఇతర సొమ్ము గానీ చెల్లించలేదంటూ ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. పత్రాలన్నీ తనిఖీ చేశాక ఖాతా వివరాలు, బ్యాంకు ఖాతాలు, సంవత్సరాంతం నిల్వ మొత్తాలు, డిపాజిటర్ల నుంచి సేకరించిన చందాలు పెట్టుబడులుగా పెట్టినట్లు ఆరోపించిన మొత్తాలకు సంబంధించిన వాటితో పాటు, చెల్లించిన మొత్తాలు, ముగింపు నిల్వలకు సంబంధించి 2014-15 నుంచి నవంబరు 2022 వరకు ఉన్న వివరాలను అధికారులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారన్నారు. చందాదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఈ చర్యలు చేపట్టామని, చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా వసూలు చేసిన సొమ్మును మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి పంపి, మ్యూచువల్‌ ఫండ్‌, ఇతర ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో పెట్టుబడులు పెడుతున్నారన్నది ఏపీ ప్రభుత్వ ప్రధాన వాదన అని పేర్కొన్నారు. ఆరోపణలన్నీ పెట్టుబడులు పెట్టారనే గానీ, ఖాతాదారుల సొమ్మును ఖాతాల్లో చూపలేదని గానీ, కనిపించకుండా చేశారన్నది కాదన్నారు. ఏపీ అధికారులు ఆరోపించిన విధంగా ఒక వేళ చిట్‌ఫండ్‌ కంపెనీ పెట్టుబడులు పెట్టిందనుకున్నప్పటికీ ప్రాథమికంగా అది నేరపూరిత దుర్వినియోగం లేదా చందాదారుని మోసగించడం కాదని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో 108 శాఖల ద్వారా లక్షల మంది చందాదారులు, రూ.10 వేల కోట్ల టర్నోవరుతో 60 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నప్పటికీ, చిట్‌ఫండ్‌ కంపెనీపై ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయకపోవడం ఆసక్తికరమన్నారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనల ప్రకారం ఏదైనా నేరం జరిగిందా లేదా అంటూ చీకట్లో వెతుకుతున్నారని చెప్పారు. స్టాంపుల శాఖ కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పత్రికా ప్రకటనల ప్రకారం అధికారుల సాధారణ ఫిర్యాదులు తప్ప ఆర్థిక మోసం జరిగినట్లు స్పష్టమైన ఫిర్యాదు లేదన్నారు. నవంబరు 28న కమిషనర్‌ విలేకరుల సమావేశం నిర్వహించినప్పటికీ కేసులు నమోదు చేసిన మార్చి 10వ తేదీ వరకు ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయలేదన్నది అంగీకరించాల్సిన విషయమని పేర్కొన్నారు.

ఈ కోర్టుకు పరిధి ఉంది

మార్గదర్శితో పాటు పిటిషనర్లు ఇదే కోర్టులో ఏపీ ప్రభుత్వ చర్యలపై ఇప్పటికే రెండు పిటిషన్‌లు దాఖలు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్లు హైదరాబాద్‌లో నివాసం ఉండటంతో పాటు మార్గదర్శి ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉందని, బ్రాంచిల ద్వారా చందాదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయానికి పంపి పెట్టుబడులు పెడుతున్నారన్నది పిటిషనర్లపై ప్రధాన ఆరోపణ అని, అందువల్ల అధికరణ 226(2) ప్రకారం ఈ కోర్టుకు విచారణ పరిధి ఉందన్నారు. నవీన్‌చంద్ర ఎన్‌.మజీతియాస్‌ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న ప్రకారం మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీ దాఖలు చేసిన పిటిషన్‌లపై ఉత్తర్వులు జారీ చేసే పరిధి ఈ కోర్టుకు ఉందని స్పష్టం చేశారు.


కేసు బదిలీ చేయాలన్న వాదనకు బలం

చిట్‌ఫండ్‌ కంపెనీపై నమోదైన ఫిర్యాదులన్నీ ఒకేలా ఉన్నాయని ఈ కోర్టు గమనించిందన్నారు. ఒక్క ఫిర్యాదు కూడా చందాదారు నుంచి రాలేదన్నారు. టి.టి.ఆంటోనీ వర్సెస్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే నేరానికి సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చట్ట ఉల్లంఘనేనన్నారు. ఒకే నేరానికి సంబంధించి అందే ఫిర్యాదులపై ఎక్కువ కేసులు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. ఈ కేసులోనూ ఆరోపణలన్నీ ఒకటే అయినప్పటికీ ఏపీలోని చాలా పోలీసుస్టేషన్‌లలో పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నందున దర్యాప్తును ఏపీలో కాకుండా బయట ఇతర సంస్థలకు అప్పగించాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలో బలం ఉందన్నారు.  ఇదే హైకోర్టులో మరో రెండు పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున భిన్నమైన ఉత్తర్వులు వెలువడకుండా నివారించడానికి వాటితో కలిపి విచారించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్ల వాటితో జత చేయడానికి వీలుగా ఈ పిటిషన్‌లను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అప్పటివరకు ఈ ఫిర్యాదులతో పాటు ఇలాంటి వాటిలో మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఏపీ ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.


ఒకే రోజు కేసులన్నీ నమోదు

మార్గదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

బ్రాంచిల నుంచి హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయానికి నగదు వస్తుందన్నదే కేసు అని, అయితే లెక్కకు మించి కేసులు నమోదు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని మార్గదర్శి ఛైర్మన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టుకు నివేదించారు. మార్చి 10వ తేదీన మూడున్నర గంటల్లో 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని తెలిపారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న మొత్తాలు వేర్వేరుగా ఉన్నాయని, ఆరోపణలు మాత్రం ఒక్కటేనని తెలిపారు. ఒకే నేరానికి సంబంధించి పలు కేసులు నమోదు చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేయడానికే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పలు స్టేషన్‌లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తోందని, అందువల్ల దర్యాప్తును ఏపీ పరిధిలోకాకుండా వేరే ఇతర సంస్థలకు బదిలీ చేయాలని కోరారు. పిటిషనర్లను అరెస్ట్‌ చేస్తున్నట్లు అధికారులు ప్రచారం చేస్తున్నారని సీనియర్‌ న్యాయవాది చెప్పారు.

గత ఏడాది డిసెంబరు 13న విజయవాడ జిల్లా రిజిస్ట్రార్‌ హైదరాబాద్‌ మార్గదర్శి కార్యాలయంలో సోదాలు చేయడానికి విజయవాడ సబ్‌రిజిస్ట్రార్‌కు అధికారం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ మార్గదర్శి పిటిషన్‌ దాఖలు చేయగా, సింగిల్‌ జడ్జి దీనిపై స్టే మంజూరు చేశారన్నారు. నవంబరు, డిసెంబరులో జరిగిన సోదాలకు సంబంధించి బ్రాంచీల పరిధిలోని రిజిస్ట్రార్‌లు నోటీసులు జారీ చేయాలని, వాటికి మార్గదర్శి వివరణ ఇవ్వాలని, అధికారులు చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 46(3)ను అమలు చేయాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. శ్రీరాం చిట్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందన్నారు. ఈ తీర్పు ప్రకారం చిట్‌ఫండ్‌ వ్యాపారం వడ్డీ వ్యాపారం కాదన్నారు. అందువల్ల ఐపీసీ లేదా డిపాజిటర్ల చట్టం నిబంధనలు వర్తించవని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ఏవైనా ఉల్లంఘనలు ఉంటే చిట్‌ఫండ్‌ చట్టం 1982కు లోబడే ఉంటాయని చెప్పారు. చిట్‌ఫండ్‌ వ్యాపారం బ్యాంకింగ్‌ వ్యాపారం కాదని సుప్రీంకోర్టు పేర్కొందని, అయినప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లో అధికారులు ఆర్‌బీఐ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటున్నారని తెలిపారు. ఆర్‌బీఐ చట్టం కింద కేసు పెట్టడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. చిట్‌లపై కమీషన్‌ తీసుకుంటామని, దీంతో పాటు లాభాలను ఎలాంటి వడ్డీ లేకుండా నిల్వలను ఖాళీగా ఉంచకుండా పెట్టుబడులు పెడుతున్నట్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. చిట్‌ పాడుకున్న వారికి తగిన హామీ తీసుకుని సొమ్ము చెల్లిస్తామని, అలా హామీ ఇవ్వలేని వారికి చివరి వాయిదా చెల్లింపు పూర్తయిన తరువాత వడ్డీ సహా చెల్లిస్తామని తెలిపారు. చిట్‌ వ్యాపారానికి సంబంధించి చట్ట ప్రకారం రిజర్వులను ఉంచుతున్నామని చెప్పారు.. చిట్‌లో ఖాళీలున్నాయన్నది ఆరోపణలని, బ్యాలెన్స్‌ షీట్‌ను పరిశీలిస్తే అన్ని వివరాలు ఉంటాయని చెప్పారు. ఏపీ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలీసుల సాయంతో వాస్తవంగా అక్కడ ఏమీ లేకపోయినా మార్గదర్శిలో ఏదో జరిగిపోతోందని అసత్య ప్రచారం చేస్తోందని పిటిషనర్ల న్యాయవాది చెప్పారు. చందాదారుపై ఎలాంటి ప్రభావం లేకపోయినా రాజకీయ నాయకులు, పోలీసులు పరువు నష్టం కలిగించేలా ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. అందువల్ల పత్రికా ప్రకటనలు ఇవ్వకుండా అధికారులను నియంత్రించాలని కోరారు. ముఖ్యమంత్రి పరువు నష్టం కలిగేలా ప్రకటనలు చేస్తున్నారన్నారు. దర్యాప్తును ఏపీ రాష్ట్రంలో కాకుండా బయటి దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కోరారు. ఇక్కడ తెలంగాణ వర్సెస్‌ భాజపా కేసులో కూడా ఇదే హైకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉండటంతో పాటు నిధులను ఇక్కడికి మళ్లించారని ఆరోపణలు చేస్తున్నారని, అందువల్ల ఈ పిటిషన్‌లపై విచారించి ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఈ కోర్టుకు ఉందని సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. మరో పిటిషనర్‌ అయిన మార్గదర్శి ఎండీ తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ మార్గదర్శిపై దుష్ప్రచారం చేయడంతో పాటు అక్కడి బ్రాంచి మేనేజర్లను అరెస్ట్‌ చేస్తున్నారన్నారు. పిటిషనర్లతోపాటు మార్గదర్శి సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా అధికారులను నియంత్రించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని