YSRCP: జగనన్న స్టిక్కర్లు.. మా గోడలపై వద్దే వద్దు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా జగనన్న స్టిక్కర్లను అతికించడానికి అగురువీధివారు అంగీకరించలేదు.

Updated : 15 Apr 2023 07:13 IST

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా జగనన్న స్టిక్కర్లను అతికించడానికి అగురువీధివారు అంగీకరించలేదు. గురువారం రాత్రి ఆ వీధిలో వైకాపా నాయకులు పర్యటించి ఇళ్లపై స్టిక్కర్లు అతికించేందుకు ప్రయత్నించారు. తమ గోడలపై వద్దే వద్దంటూ తెదేపా సానుభూతిపరులైన కొవ్వాడ రమేష్‌, నాగరాజు, రాజు తెగేసి చెప్పేశారు. దీనిపై వారితో సర్పంచి అట్టాడ శ్రీను, పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు. స్టిక్కర్లు అతికించకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. పథకాలను ఎందుకు ఆపుతారంటూ వారు నాయకులను ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం అక్కడ నుంచి వైకాపా నాయకులు వెనుదిరిగారు. ఈ విషయం తెలిసి శుక్రవారం పార్టీ సానుభూతిపరులను తెదేపా జిల్లా నేత సువ్వాడ రవిశేఖర్‌, మండల పార్టీ అధ్యక్షుడు కడగల ఆనందకుమార్‌ పరామర్శించారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గురాన చక్రధర్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డి రామకృష్ణ, మాజీ సర్పంచి గురాన అసిరినాయుడు వారి ఇళ్లకు వెళ్లి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని