Tirumala: తిరుమల గగనతలంలో విమానాలు

తిరుమల శ్రీవారి ఆలయ సమీపం నుంచి గురువారం ఉదయం 7.45, 8.00, 8.22 గంటలకు వరుసగా 3 విమానాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

Updated : 09 Jun 2023 08:32 IST

నెల వ్యవధిలో ఇది మూడోసారి

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే-తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ సమీపం నుంచి గురువారం ఉదయం 7.45, 8.00, 8.22 గంటలకు వరుసగా 3 విమానాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదు. ఈ ఘటనపై తితిదే భద్రతాధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పైనుంచి విమానాలు వెళ్లకూడదు. దీనిపై గతంలో తితిదే కేంద్ర పౌర విమానయానశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అయితే.. ఆ నిబంధన అమలు చేయడం వీలుకాదని అప్పట్లో ఆ శాఖ తెలిపినట్లు సమాచారం. దేశంలో రక్షణ పరంగా సమస్య ఉన్న వాటిని నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటిస్తారు. తిరుమలనూ ఆ జోన్‌ పరిధిలోకి తేవాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. దీంతో తిరుమలపైనుంచి లోహ విహంగాలు వెళ్లినప్పుడల్లా అధికారులు విమానయానశాఖ అధికారులకు ఫోన్‌ చేసి వాటి వివరాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భూతలంలో ఆక్టోపస్‌ భద్రత సిబ్బందితోనూ పహారా ఏర్పాటు చేసినా.. గగనతల పర్యవేక్షణే సవాలుగా మారింది. నెల రోజుల వ్యవధిలో 3 సార్లు లోహ విహంగాలు ఆలయానికి అతి సమీపం నుంచే ప్రయాణించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం దృష్టిసారించి విమానాల రాకపోకలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని