TTD: అప్రమత్తతతోనే అరగంటలో పరిష్కారం

టోకెన్లు లభిస్తాయో లేదోనన్న ఆతృతతో భక్తులు క్యూలైన్లలోకి దూసుకెళ్లడంతోనే మంగళవారం తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద గందరగోళం ఏర్పడిందని.. తాము అప్రమత్తమై

Updated : 14 Apr 2022 05:45 IST

ఇక టోకెన్లు లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనం

తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

ఈనాడు, తిరుపతి: టోకెన్లు లభిస్తాయో లేదోనన్న ఆతృతతో భక్తులు క్యూలైన్లలోకి దూసుకెళ్లడంతోనే మంగళవారం తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద గందరగోళం ఏర్పడిందని.. తాము అప్రమత్తమై అరగంటలోనే సమస్యను పరిష్కరించామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం 15వేల టోకెన్లు జారీచేసే వరకూ ఇబ్బంది లేదని.. 10 గంటల సమయంలో మొదట శ్రీనివాసం కేంద్రం వద్ద సమస్య తలెత్తడంతో భక్తులను నియంత్రించడం కష్టమవుతోందని అధికారులు సమాచారమిచ్చారని తెలిపారు. వెంటనే టోకెన్ల జారీ నిలిపివేసి భక్తులను తిరుమలకు తరలించి వైకుంఠం-2లో పెట్టి దర్శనం చేయించాలని సూచించినట్లు వెల్లడించారు. అరగంటలోనే క్యూలైన్ల నుంచి భక్తులను తరలించినట్లు వెల్లడించారు. ఇకపై టోకెన్లు లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. బుధవారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘సర్వదర్శన టైమ్‌స్లాట్‌ టోకెన్లను తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో ఇస్తున్నాం. అక్కడ ఇవ్వాలనుకున్న ప్రతిసారీ సమస్యలొచ్చాయి. ఒకేసారి మూడు నాలుగు రోజుల టోకెన్లను ఇచ్చినా మూడో రోజుకు టోకెన్లు ఉన్న భక్తులు వచ్చి తమకు అదేరోజు దర్శనం కల్పించాలని ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి. కొవిడ్‌ సమయంలో రెండున్నర నెలలు  ఎస్‌ఎస్‌డీ టోకెన్లను ఆన్‌లైన్‌లో ఇచ్చాం. దీనివల్ల గ్రామీణ, కంప్యూటర్‌ పరిజ్ఞానం లేని భక్తులు నష్టపోతున్నారని గుర్తించి, తిరిగి మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 11 వరకు చక్కగా నిర్వహించాం. భక్తులు ఎస్‌ఎస్‌డీ టోకెన్లు తీసుకుని అరగంట ముందు తిరుమల వచ్చి గంటన్నరలో శ్రీవారి దర్శనం చేసుకునేవారు.

లక్ష టోకెన్ల జారీకి సిద్ధమయ్యాం
9, 10, 11 తేదీల్లో రద్దీ దృష్ట్యా 8వ తేదీనే టోకెన్లు జారీచేశాం. 3 రోజులు ఇచ్చినందునకౌంటర్లు మూసేశాం. తిరిగి మంగళవారం రోజున బుధ, గురు, శుక్రవారాలకు లక్ష టోకెన్లు ఇవ్వాలనుకున్నాం. శనివారం టోకెన్లు దొరకని కొందరు తిరుపతిలోనే ఉండిపోయారు. నాలుగు రోజులు సెలవులుండటంతో మరికొందరు వచ్చారు. మొత్తం మూడు ప్రదేశాల్లో 20వేల మంది ఉన్నారు. శ్రీనివాసంలో రెండు లైన్లున్నాయి. ఒక లైను నుంచి టోకెన్‌ తీసుకుని మరోలైను నుంచి బయటకు రావాలి. భక్తులు బయటకు వెళ్లే లైన్‌లోకి ప్రవేశించి టోకెన్‌ ఇవ్వాలన్నారు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. గాయాలయ్యాయి.. సొమ్మసిల్లి పడిపోయారని దుష్ప్రచారం చేయడం సరికాదు. అందరినీ తీసుకొస్తే 12 కంపార్ట్‌మెంట్లలోనే ఉన్నారు. మంగళవారం ఉక్కపోతకు 15-20 నిమిషాలు ఇబ్బందిపడి ఉంటారు. పాత పద్ధతిలో సర్వదర్శనాన్ని అమలుచేస్తే.. 20, 30, 40 గంటలు ఇబ్బంది పడాలి. కొవిడ్‌ ఇంకా పూర్తిగా పోలేదు. మరి ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో 500 మందిని ఉంచడం మంచిదా?’

ముందు నుంచే సన్నద్ధం..
‘ముందస్తు ఏర్పాట్లు చేయకుంటే భక్తులను ఇలా తరలించి దర్శనం చేయించే ఏర్పాట్లు జరిగేవా? మార్చి 1వ తేదీ నుంచే వైకంఠం-2 కాంప్లెక్సులను సిద్ధంగా ఉంచుకున్నాం. తాగునీరు, ఆహారం, పాల సరఫరాకు చర్యలు చేపట్టాం. మధ్యాహ్నం నుంచి వచ్చినవాళ్లలో 35వేల మందికి ఎస్‌ఎస్‌డీ దర్శనం చేయించాం. భక్తులను భగవంతుడికి దూరం చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. అలా అయితే ఇంత రిస్క్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. టైమ్‌స్లాట్‌ టోకెన్‌ ద్వారా ఎప్పుడు దర్శనం ఉంటుందో తెలుస్తుంది. గతంలో ఒకోసారి దర్శనానికి 72 గంటలూ పట్టేది. అంతవరకూ క్యూ/కంపార్ట్‌మెంట్లలో ఉండాలి. భక్తులకు మరింత మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థను పటిష్ఠం చేయాలని ప్రయత్నించాం. భక్తులకు స్వామివారిని దూరం చేశామనడం తప్పు.’


తెల్లవారుజాము 2.15 గంటల వరకు దర్శనం

‘మంగళవారం జరిగిన చిన్న ఘటనను పెద్దగా చిత్రీకరించారు. అది తప్పు. బుధవారం దాదాపు 80 వేల మందికి దర్శనం చేయిస్తున్నాం. ఎక్కడా పొరపాటు జరగలేదు. మంగళవారం మధ్యాహ్నం తిరుమల చేరుకున్న భక్తులకు తెల్లవారుజామున   2.15 గంటల వరకు దర్శనం కల్పించాం. నిర్లక్ష్యం వహించలేదు. సమస్య వచ్చింది కాబట్టే పరిష్కరించగలిగాం. నవంబరులో వరదల సమయంలో శ్రీవారి మెట్టుమార్గం భారీగా దెబ్బతింది. దానికి యుద్ధప్రాతిపదికన టెండర్లు పిలిచాం. సిమెంటు, ఇసుక అంతా మనిషి మోసుకుని తీసుకురావాలి. అది కొంచెం ఆలస్యమైన పద్ధతి. ఈనెల 30న దాన్ని ప్రారంభిస్తాం. 17 రోజుల్లోగా దాన్ని పూర్తిచేస్తాం. వీఐపీ బ్రేక్‌లను రద్దుచేశాం. వ్యక్తిగతంగా వచ్చే ప్రముఖులకే ఇస్తున్నాం. బుధవారం గంటన్నరలోనే వీఐపీ బ్రేక్‌ పూర్తిచేశాం’ అని ధర్మారెడ్డి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని