Google: గూగుల్‌కు సీసీఐ భారీ జరిమానా

ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌కు భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) భారీ జరిమానా విధించింది.

Updated : 20 Oct 2022 22:02 IST

దిల్లీ: ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌కు భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) భారీ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. ఇందుకు ప్రతిగా రూ.1337.76 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని హితవు పలికింది. 

స్మార్ట్‌ ఫోన్‌ పనిచేయాలంటే దానికి ఓఎస్‌ కావాలి. అలాంటి ఓఎస్‌ల్లో ఆండ్రాయిడ్‌ ఒకటి. దాన్ని గూగుల్‌ 2005లో కొనుగోలు చేసింది. మొబైల్‌ కంపెనీలు దాదాపు ఇదే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను వాడుతున్నాయి. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటు, ప్లే స్టోర్‌, గూగుల్‌ సెర్చ్‌, గూగుల్‌ క్రోమ్‌, యూట్యూబ్‌ తదితర అప్లికేషన్లను గూగుల్‌ కలిగి ఉందని సీసీఐ పేర్కొంది. వీటి ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను గూగుల్‌ అవలంబిస్తోందని పేర్కొంటూ జరిమానా విధించింది. గూగుల్‌ అందించే ప్రీ ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌ను డిలీట్‌ చేయకుండా నిరోధించడం వంటివి చేయకూడదంటూ పలు సూచనలు చేసింది. జరిమానా విధించేందుకు సీసీఐ ప్రధానంగా  5 అంశాలను పరిగణలోకి తీసుకుంది.

  • స్మార్ట్‌ ఫోన్లు పని చేయాడానికి అవసరమైన ఓఎస్‌
  • ఆండ్రాయిడ్‌ ఫోన్లలో యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఉపయోగించే యాప్‌స్టోర్‌
  • సాధారణ వెబ్‌ సెర్చ్‌ సేవలు
  • నాన్‌ ఓఎస్‌ స్పెసిఫిక్‌ మొబైల్‌ వెబ్‌ బ్రౌజర్లు
  • ఆన్‌లైన్‌ వీడియో హోస్టింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ (ఓవీహెచ్‌పీ)

యాపిల్‌ ఓస్‌ నుంచి ఎదుర్కొంటున్న పోటీ గురించి విచారణ సమయంలో గూగుల్‌ ఐఐసీ దృష్టికి తీసుకెళ్లింది. అయితే గుగూల్‌ తమ వినియోగదారులను పెంచుకోవాలనే ఉద్దేశంతో అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఐఐసీ భావించింది. అంతేకాకుండా వినియోగదారులు పెరిగితే, తద్వారా రెవెన్యూ రాబట్టేందుకు గూగుల్‌ ప్రయత్నిస్తోందని చెప్తూ నిర్ణీత గడువులోగా పోటీ వ్యతిరేక పద్ధతులను మానుకోవాలని గూగుల్‌కు హితవు పలికింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని