ఐటీకి పండుగే

దేశీయంగా, అంతర్జాతీయంగా పలు రంగాల్లో చోటుచేసుకుంటున్న డిజిటలీకరణ, క్లౌడ్‌కు అనుగుణంగా సాంకేతిక వ్యవస్థల మార్పు వల్ల, ఐటీ వ్యయాలు ఎన్నడూ లేని గరిష్ఠస్థాయికి 2022లో చేరనున్నాయని పరిశోధనా

Published : 02 Dec 2021 06:16 IST

వచ్చే మూడేళ్లు భారీ ఆర్డర్లు

2022లో రూ.7.63 లక్షల కోట్లకు దేశీయ ఐటీ వ్యయాలు: గార్ట్‌నర్‌

దేశీయంగా, అంతర్జాతీయంగా పలు రంగాల్లో చోటుచేసుకుంటున్న డిజిటలీకరణ, క్లౌడ్‌కు అనుగుణంగా సాంకేతిక వ్యవస్థల మార్పు వల్ల, ఐటీ వ్యయాలు ఎన్నడూ లేని గరిష్ఠస్థాయికి 2022లో చేరనున్నాయని పరిశోధనా సంస్థ గార్ట్‌నర్‌ అంచనా వేస్తోంది. ఇది భారత ఐటీ కంపెనీలకు కలిసొచ్చే పరిణామంగా తెలిపింది. వచ్చే మూడేళ్ల కాలం ఐటీ సేవల కంపెనీలకు భారీ అవకాశాలు లభిస్తాయనీ, అందుకే లక్ష్యాలను మించి ఫ్రెషర్లకు కంపెనీలు అవకాశాలిస్తున్నాయని పేర్కొంది.

దేశీయంగా ఐటీ వ్యయాలు వచ్చే ఏడాది సుమారు రూ.7.63 లక్షల కోట్ల (101.8 బిలియన్‌ డాలర్ల)కు చేరొచ్చన్నది సంస్థ అంచనా. 2020తో పోలిస్తే ఐటీ వ్యయాలు 2021లో 10.8 శాతం అధికమవుతున్నాయని, దీనితో పోలిస్తే 2022లో 7 శాతం పెరుగుతాయన్నది సంస్థ అంచనా. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ రంగానికి అధిక వృద్ధి లభిస్తుందని, ఇందుకనుగుణంగా నియామకాలు జరుగుతాయని వివరించింది. కొవిడ్‌ ముందుతో పోలిస్తే, దాదాపు రెట్టింపు వ్యయాలు 2022లో సాఫ్ట్‌వేర్‌పై జరుగుతాయని పేర్కొంది. ఇందువల్ల ఫ్రెషర్లకు భారీ అవకాశాలు లభిస్తాయని తెలిపింది. అయితే క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా అనుభవజ్ఞులను నియమించుకునేందుకు సంస్థలు అధిక వ్యయాలు చేయాల్సి వస్తుందని పేర్కొంది. వారంలో కొన్ని రోజులు కార్యాలయానికి వచ్చి, మరికొన్నిరోజులు ఇంటి నుంచి పని చేసే హైబ్రిడ్‌ విధానం కొనసాగుతుంది కనుక, హార్డ్‌వేర్‌ పరికరాల కొనుగోళ్లు అధికమవుతాయని సంస్థ అంచనా వేస్తోంది. ఐటీ వ్యయాల్లో 43 శాతం వాటా పరికరాలదే ఉంటుందని సంస్థ విశ్లేషిస్తోంది.

లక్ష్యాలకు మించి నియామకాలు
2021-22కు ఐటీ సంస్థలు ముందుగా వేసుకున్న అంచనాలకు మించి కళాశాల ప్రాంగణాల్లో ఎంపికలు చేయనున్నాయి.
టీసీఎస్‌: 43,000 మందిని నియమించుకోవాలన్నది ప్రణాళిక. ఇప్పటికే పూర్తిచేసింది. మరో 35,000 మందిని ఎంపిక చేయనుంది.
ఇన్ఫోసిస్‌: 35,000 నియామకాలు తొలి ప్రణాళిక. అదనంగా 10,000 మందిని నియమించుకోనుంది.
హెచ్‌సీఎల్‌ టెక్‌: 2022-23కు 30,000 మంది ఫ్రెషర్లను నియమించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000-22,000 మందిని ఎంపిక చేస్తోంది.

అంతర్జాతీయ కంపెనీల నుంచీ
అంతర్జాతీయ కంపెనీలు ఐటీ సేవల కోసం వెచ్చించే మొత్తం 2021తో పోలిస్తే 2022లో 11 శాతం పెరగొచ్చని గార్ట్‌నర్‌ పేర్కొంది. ఈ అవకాశాలను అందుకుని, సమర్థంగా అమలు చేయడంలో భారతీయ టెక్‌ కంపెనీలకు ఉన్న ప్రావీణ్యత దృష్ట్యా అధికంగా లాభపడతాయని వివరించింది. క్లౌడ్‌, డిజిటలీకరణ దిశగా టెక్నాలజీని మార్చుకునే సంస్థలు, పలు సంవత్సరాల పాటు నిర్వహించే కాంట్రాక్టులను భారత్‌ టెక్‌ కంపెనీలకే కేటాయిస్తాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది.

ఈ రంగాల నుంచి అధిక గిరాకీ
* ఆరోగ్య సంరక్షణ * సైబర్‌ సెక్యూరిటీ * కమ్యూనికేషన్‌


డిజిటలీకరణ మరికొన్నేళ్లు కొనసాగుతుంది

కొవిడ్‌ పరిణామాల ఫలితంగా భిన్నరంగాల్లో శరవేగంగా ప్రారంభమైన డిజిటలీకరణ ప్రక్రియ మరికొన్నేళ్లు కొనసాగుతుంది. ఈ ఏడాది కొవిడ్‌ రెండోదశ తీవ్ర ప్రభావం చూపినా, భారత్‌ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంది. వచ్చే ఏడాది కూడా సంస్థలు వినూత్న టెక్నాలజీ, వ్యవస్థల ఆధునికీకరణ కోసం వెచ్చించనున్నాయి. ఇందువల్ల ఐటీ ప్రాజెక్టులు అధికమవుతాయి.

- అరుప్‌ రాయ్‌, గార్ట్‌నర్‌ రీసెర్చ్‌ వైస్‌ప్రెసిడెంట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని