కుమార్తెల ముందే జర్నలిస్ట్‌పై కాల్పులు

ఓ జర్నలిస్టుపై పలువురు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఇద్దరు కూతుర్ల ఎదుటే..

Published : 22 Jul 2020 01:55 IST

సీసీ పుటేజీల్లో రికార్డయిన దృశ్యాలు

ఘజియాబాద్‌: ఓ జర్నలిస్టుపై పలువురు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆయన ఇద్దరు కూమార్తెల ఎదుటే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లోని విజయనగర్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ టీవీ పుటేజీల్లో రికార్డయ్యాయి. జర్నలిస్టు విక్రమ్‌ జోషి ఇద్దరు కూతుర్లతో ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. కాగా ఓ ముఠా వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డగించి జోషిపై దాడికి పాల్పడి కాల్పులు జరిపారు. ప్రస్తుతం జోషి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. దుండగులు బైకును అడ్డగించి తండ్రీ కూతుళ్లు కిందపడ్డాక జోషిపై దాడికి పాల్పడ్డారు. దీంతో జర్నలిస్టు కుమార్తెలు ఇద్దరు అక్కడినుంచి పరిగెత్తారు. దాడి అనంతరం పెద్ద కుమార్తె అక్కడికి వచ్చి ఏడవడం, సహాయం కోసం అర్థించడం సీసీ పుటేజీల్లో రికార్డయ్యింది. పలువురు స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. 

ప్రధాన నిందితుడు సహా దాడికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారంతా జర్నలిస్టుకు తెలిసినవారే అని పేర్కొన్నారు. తన మేనకోడలును ఓ ముఠా వేధింపులకు గురిచేస్తోందంటూ జోషి ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వారే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని