Crime: నిశ్చితార్థానికి ముందురోజే మృత్యు ఒడికి

తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన యువతిని భవనం రెయిలింగ్‌ శకలాల రూపంలో మృత్యువు కబళించింది. శుభకార్యంతో కళకళలాడాల్సిన ఆ ఇల్లు

Updated : 08 Jul 2021 07:14 IST

భవనం రెయిలింగ్‌ శకలాలు పడి యువతి దుర్మరణం

మూసాపేట, కరణ్‌కోట (తాండూరు గ్రామీణ), న్యూస్‌టుడే: తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన యువతిని భవనం రెయిలింగ్‌ శకలాల రూపంలో మృత్యువు కబళించింది. శుభకార్యంతో కళకళలాడాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంలో మునిగింది. కూకట్‌పల్లి పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కరణ్‌కోట జయశంకర్‌ కాలనీకి చెందిన జెట్టూరి శేఖర్‌, సత్తమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు రోజా, శ్వేత; కుమారుడు నవీన్‌ ఉన్నారు. సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)లో శేఖర్‌ ఒప్పంద కార్మికుడు. పెద్ద కుమార్తె రోజా(24) ఎమ్మెస్సీ చదివి ఫార్మసీ కోర్సు చేసింది. కూకట్‌పల్లిలోని అనన్య ఆసుపత్రి సమీపంలో అద్దెకు ఉంటూ ఉంటూ శామీర్‌పేటలోని లాల్‌గడి మలక్‌పేటలోని ఎస్‌.పి.అక్యూర్‌ ల్యాబ్‌ సంస్థలో పనిచేస్తోంది. వికారాబాద్‌లోని మిషన్‌ ఆసుపత్రి వైద్యుడితో వివాహం చేయాలని నిర్ణయించారు. బుధవారం జరగాల్సిన నిశ్చితార్థం ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు మునిగిపోయాయి. నూతన వస్త్రాలు తీసుకొనేందుకు స్నేహితురాలు మౌనికతో కలిసి రోజా మంగళవారం రాత్రి 7.30 ప్రాంతంలో డిజైనర్‌ వద్దకు వెళ్లింది. ఆమె లేకపోవడంతో దుకాణం ముందు నిరీక్షిస్తుండగా భవనం మూడో అంతస్తు నుంచి పెద్ద రెయిలింగ్‌ శకలాలు ఆమె తలపై పడటంతో కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని బుధవారం సొంతూరికి తరలించారు. మంగళవారమే రావాల్సి ఉండగా, చీకటి పడడంతో బుధవారం తెల్లవారుజామున రావాలని తండ్రి సూచించారు. భవనం ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువుది. రెయిలింగ్‌కు పగుళ్లున్నాయని యజమాని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పలువురు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని