పూజ గదిలో బంగారం వెలికి తీస్తామని.. రూ.లక్షలు వసూలు చేసిన నకిలీ బాబాలు

పూజ గదిలో బంగారం వెలికి తీస్తామని మోసం చేసిన నకిలీ బాబాలను అరెస్టు చేసిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎన్‌.చంద్రబాబు తెలిపిన వివరాలు.. కరీంనగర్‌

Updated : 23 May 2022 08:10 IST

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: పూజ గదిలో బంగారం వెలికి తీస్తామని మోసం చేసిన నకిలీ బాబాలను అరెస్టు చేసిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎన్‌.చంద్రబాబు తెలిపిన వివరాలు.. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరానికి చెందిన మతం చందు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లికి చెందిన ఎర్నాళ్ల సంజీవ్‌ అలియాస్‌ సంజయ్‌ బాబాలుగా అవతారమెత్తారు. ఏప్రిల్‌ 11న ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో మాచర్ల రాజు వద్దకు వచ్చి బాబాలుగా పరిచయం చేసుకున్నారు. మీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడితే అంతా శుభం కలుగుతుందని చెప్పారు. అంగీకరించిన ఆయన భోజనం పెట్టారు. ఇంట్లో పూజ గది మూసి ఉండడంతో ఆరా తీశారు. సోదరుడి కుమారుడు చనిపోవడంతో పూజలు చేయడం లేదని రాజు పేర్కొన్నారు. ఇంట్లో దెయ్యం ఉందని, అమావాస్య రోజు పూజ చేయాలని, లేకపోతే మరో మరణం సంభవిస్తుందని భయపెట్టి.. రూ.3వేలు తీసుకొని వెళ్లిపోయారు. వారం తర్వాత బాబాలను కలిసి పూజ చేయాలని కోరగా అందుకు వారు రూ.35 వేలు తీసుకుని పూజలు చేసి వెళ్లి పోయారు. పది రోజుల తర్వాత బాబాలు మళ్లీ వచ్చి మీ ఇంట్లో పూజ గదిలో రూ.4 కోట్ల విలువైన బంగారం ఉందని నమ్మించారు. నమ్మిన ఆయన బంగారం వెలికి తీయాలని కోరారు. అందుకు సిద్దిపేటలో రూ.1.80 లక్షలు విలువ చేసే పూజా సామగ్రి కొనుగోలు చేయాలని చెప్పి రూ.30 వేల సామగ్రి రాజుకు ఇచ్చి పంపించారు. కమీషన్‌గా దుకాణదారుడు బాబాలకు రూ.1.50 లక్షలు చెల్లించాడు. అనంతరం వివిధ పూజల పేరిట రూ.7.5 లక్షలను వారు వసూలు చేశారు. పూజలు చేశామని.. కొన్ని రోజుల తర్వాత పూజ గది తెరిచి చూడాలని చెప్పి వెళ్లిపోయారు. రోజులు గడిచినా.. బంగారం కనిపించక పోవడంతో మోసపోయామని గ్రహించారు. ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌వోటీ బృందం సాయంతో ఆదివారం నకిలీ బాబాలను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.15 వేల నగదు, కారు, పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు