Jewellery Store: అందరూ చూస్తుండగానే.. బంగారు దుకాణం లూటీ!

బంగారు దుకాణంలోని సిబ్బందిని బెదిరించి.. ఐదుగురు దుండగలు మొత్తం నగలను ఎత్తుకుపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రాజపుర్‌ రోడ్‌లో చోటు చేసుకుంది.

Published : 09 Nov 2023 18:34 IST

దెహ్రాదూన్‌: పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఐదుగురు దుండగులు ఓ బంగారు దుకాణాన్ని లూటీ చేశారు. అక్కడి సిబ్బందిని తుపాకీలతో బెదిరించి మొత్తం నగలను ఎత్తుకుపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) దెహ్రాదూన్‌ (Dehradun) రిలయన్స్‌ జ్యూయలరీ స్టోర్‌లో గురువారం ఉదయం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మూడు రోజుల పర్యటకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉత్తరాఖండ్‌ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు, సాయుధ బలగాలు ఆమెకు భద్రత కల్పించే పనుల్లో నిమగ్నమయ్యారు. దీనిని దుండగులు అవకాశంగా మలచుకున్నారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక రాజాపుర్‌ రోడ్డులోని బంగారు దుకాణంలోకి.. గురువారం ఐదుగురు దుండగులు హఠాత్తుగా ప్రవేశించారు. వారిలో ఇద్దరి వద్ద గన్‌లు ఉన్నాయి. సిబ్బందిని పక్కకు తప్పుకోవాలని ఆదేశించడంతో వారిలో ఇద్దరు ముగ్గురు ప్రతిఘటించారు. వాళ్లను తాళ్లతో కట్టేసి.. మిగతావారిని బెదిరించారు. దుకాణంలోని సొత్తును మొత్తం బ్యాగుల్లో సర్దుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. సిబ్బంది ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీకెమెరా దృశ్యాలను పరిశీలించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని