Crime: భూవివాదంలో నలుగురి దారుణ హత్య

కర్ణాటక రాష్ట్రం హసన్‌లోని హోలేనరాసిపుర తాలూక మౌరగౌడనహళ్లిలో తలెత్తిన ఓ భూవివాదం నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలో చనిపోయే ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో....

Published : 01 Jun 2021 01:38 IST

వైరల్‌గా మారిన వీడియో

హసన్‌: కర్ణాటక రాష్ట్రం హసన్‌లోని హోలేనరాసిపుర తాలూక మౌరగౌడనహళ్లిలో తలెత్తిన ఓ భూ వివాదం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనలో చనిపోయే ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిందితుడు చేతిలో కత్తి పట్టుకుని ప్రత్యర్థులను బెదిరించడం, వారితో దురుసుగా మాట్లాడటం వంటి దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మే 24న ఈ ఘటన జరగ్గా వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాపనాని, రవికుమార్‌ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య మొదట ఈ భూ వివాదం తలెత్తింది. అదికాస్తా చిలికిచిలికి గాలివానలా మారడంతో ఇరు వర్గాలు పొలంలో గొడవకు దిగాయి. ఈ క్రమంలో రవిశంకర్‌ సహా మరో ఇద్దరిని పాపనాని కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న రవికుమార్‌.. మిత్రుడు భానుతో కలిసి పాపనానిని హతమార్చారు. ఈ ఘటన జరగడానికి ముందు రవిశంకర్‌ తీసిన వీడియో వైరల్‌గా మారింది.

ఈ ఘటనలో రవిశంకర్‌, మల్లేశ్‌, మంజేషా, పాపనాని మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో మొదటి ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పాపనానికి మద్దతుగా నిలిచిన ప్రదీప, యోగేశ్‌, రవి, సచిన్‌ ఉన్నట్లు పేర్కొన్న పోలీసులు.. వారిని అరెస్టు చేసినట్లు వివరించారు. మరో నిందితుడు భానును కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని