
Crime news: అత్తాకోడళ్ల మధ్య ‘సెల్ఫోన్’ చిచ్చు.. రెండు నిండు ప్రాణాలు బలి!
ఛత్తర్పూర్: అత్తా కోడళ్ల మధ్య ‘సెల్ఫోన్ చిచ్చు’ రెండు నిండు ప్రాణాల్ని బలితీసుకుంది! మొబైల్ ఫోన్ విషయంలో తన అత్తతో జరిగిన గొడవను జీర్ణించుకోలేని కోడలు (33) క్షణికావేశానికి గురైంది. తన ఇద్దరు కుమార్తెలను బావిలోకి విసిరి.. ఆపై తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ ఛత్తర్పూర్లోని పర్వా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ ఆదివారం పశువులు మేపేందుకు వెళ్లిందని, ఆ సమయంలో ఇద్దరు పిల్లల్ని బావిలోకి విసిరేసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో 10 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా.. నాలుగేళ్ల చిన్నారి బావి ఇటుకల మధ్య చిక్కుకొని ప్రాణాలతో బయటపడిందని పోలీసులు వివరించారు. సెల్ఫోన్ విషయంలో శనివారం రోజు తన అత్తతో జరిగిన గొడవే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, మహిళ నుంచి సెల్ఫోన్ను అత్త తీసుకోవడమే ఈ వివాదానికి కారణమని గ్రామస్థులు పేర్కొంటున్నారు.