Eluru: వైద్యుల నిర్వాకం.. సిజేరియన్‌ చేసి పొట్టలో కత్తెర మరిచిపోయారు!

ఏలూరులో వైద్యుల నిర్వాకం ఓ మహిళ ప్రాణాల మీదికొచ్చింది. జిల్లా బోధనాసుపత్రిలో మహిళ పొట్టలో శస్త్ర చికిత్సకు ఉపయోగించే కత్తెర ఉంచి కుట్లు వేశారు.

Updated : 16 Aug 2023 15:03 IST

ఏలూరు (నేర వార్తలు): ఏలూరులో వైద్యుల నిర్వాకం ఓ మహిళ ప్రాణాల మీదికొచ్చింది. జిల్లా బోధనాసుపత్రిలో మహిళ పొట్టలో శస్త్ర చికిత్సకు ఉపయోగించే కత్తెర ఉంచి కుట్లు వేశారు. వివరాల్లోకి వెళితే.. పెదపాడు మండలం ఎస్.కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.స్వప్న అనే మహిళ ప్రసవం కోసం ఏప్రిల్ 19న తేదీన ఏలూరు బోధనాసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. డిశ్చార్జి అయిన అనంతరం స్వప్న ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత తరచూ ఆమెకు కడుపులో నొప్పి వచ్చేది. సాధారణంగా వచ్చే నొప్పే అనుకుని మందులు వాడేది. 

అయితే ఈనెల 8న స్వప్నకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తిరిగి ఏలూరులోని బోధనాసుపత్రికి చేరుకుంది. అక్కడ వైద్యులు పరీక్షించి విజయవాడ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడ అసలు విషయం బయటపడింది. ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు ఎక్స్‌రే ద్వారా బయటపడింది. ఏలూరు బోధనాసుపత్రిలో సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసిన డాక్టర్లు.. ఆపరేషన్‌కు ఉపయోగించిన కత్తెరను కడుపులో ఉంచి కుట్లు వేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శశిధర్‌ను వివరణ కోరగా ఈ విషయం వాస్తవమేనని తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌ స్పందించి విచారణ కమిటీ వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని